
హైదరాబాద్: ఆర్.టి.సి కార్మికులు చేస్తున్న సమ్మెలో విషాదం జరిగింది. చెంగిచెర్ల డిపోలో పని చేస్తున్న డి. కొమరయ్య అనే డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. తమ డిమాండ్లను పరిష్కారించాలంటూ గురువారం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చెంగిచెర్ల డిపో నుండి ఉప్పల్ డిపో వరకు నిరసన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న కొమరయ్యకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడిని సమీపంలో ఉన్న ఆదిత్య ఆసుపత్రికి తరలించగా కొమరయ్య అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొమరయ్య మరణంతో తోటీ ఆర్టీసీ డ్రైవర్లు, ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.