- 15 తారీఖు వచ్చినా జీతాలు రాలె
- ఆర్టీసీ ఉద్యోగులు సతమతం
- పైసల్లేక, అప్పులు పుట్టక ఆగమాగం
- ఇంత లేట్ సంస్థ చరిత్రలోనే తొలిసారి
- ఆందోళనలకు సిద్ధమైన యూనియన్లు
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ ఉద్యోగులకు 15వ తారీఖు వచ్చినా జీతాలు అందలేదు. సగం నెల దాటినా జీతాలు రాకపోవడం సంస్థ చరిత్రలోనే ఇది తొలిసారి. దీంతో కార్మికులు, ఉద్యోగులు పడరాని పాట్లు పడుతున్నారు. చేతిలో పైసల్లేక బయట అప్పులు దొరక్క కుటుంబ పోషణ కోసం సతమతమవుతున్నారు. ఇంటి అద్దెలు కట్టలేక, కిరాణా సామాను తెచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వమే చేతులెత్తేయడంతో యూనియన్లు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి.
2019 సమ్మె తర్వాత సీన్ చేంజ్..
రాష్ట్రంలో 49 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులున్నారు. సాధారణంగా ఒకటో తేదీనే ఉద్యోగుల అకౌంట్లలో జీతాలు వేసేవారు. ఒకటో తేదీన సెలవుంటే ముందు రోజే శాలరీస్ పడేవి.. కానీ 2019 ఆర్టీసీ సమ్మె తర్వాత పరిస్థితి మారింది. ఒకటో తేదీ పోయి ఐదో తేదీ వచ్చింది.. ఆ తర్వాత 10వ తేదీకి చేరింది. ఇప్పుడు ఏకంగా 15వ తేదీ దాటినా శాలరీస్ లేవు. 15వ తేదీ దాటినా జీతాలు రాకపోవడం ఇదే తొలిసారని యూనియన్ నేతలు చెబుతున్నారు. హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్నగర్, వరంగల్– ఖమ్మం–నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఐదో తేదీలోపే ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. ఇటు సీసీఎస్ (క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ)లో ఉన్న 23 మంది ఉద్యోగులకు కూడా జీతాలు రాలే.
పస్తులుండాల్సిన పరిస్థితి..
ఆర్టీసీలో దాదాపు 70 శాతం మంది ఉద్యోగులకు జీతాలు రూ.25వేల లోపే ఉన్నాయి. వీరందరివి కింది స్థాయి మధ్య తరగతి కుటుంబాలే. కరోనా విజృంభిస్తున్నా రిస్క్ చేసి, డ్యూటీలు చేశారు. అయినా సమయానికి జీతాలు రావట్లేదు. దీంతో ఉద్యోగులకు కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. అనేక మందికి పూట గడవడమే కష్టమై పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనాతో బయట అప్పులు కూడా పుట్టడం లేదు. చిట్టీలు, లోన్ కిస్తీలు కట్టకపోవడంతో చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. అధిక ఫైన్లు పడుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ఉన్న బంగారం కుదువపెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు.
పట్టించుకోని సర్కారు..
కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ ఆర్టీసీని కోలుకోలేని దెబ్బతీశాయి. పైగా డీజిల్ రేట్లు రూ.100కు చేరువలో ఉన్నాయి. లాక్డౌన్తో ప్రస్తుతం 30 శాతం బస్సులు కూడా నడవడం లేదు. వచ్చిన డబ్బులు డీజిల్కు కూడా సరిపోవడం లేదు. అయితే సంస్థను ఆదుకోవడానికి బడ్జెట్లో ప్రభుత్వం రూ.3 వేల కోట్లు కేటాయించింది. కానీ ప్రతి నెలా అడ్జస్ట్ చేస్తున్న సర్కారు ఈ సారి మాత్రం చేతులెత్తేసింది. వెయ్యి కోట్లు గ్యారెంటీ ఇచ్చి అప్పులు తెచ్చుకోమంది. కానీ వివిధ కారణాలతో లోన్ ఇంకా రాలేదు. దీంతో ఉన్నాధికారులు కూడా ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు యూనియన్లు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.
బంగారం కుదవెట్టిన..
ఈ నెల జీతాలు ఇంకా రాకపోవడంతో డబ్బులకు మస్తు ఇబ్బంది అయ్యింది. ఇల్లు గడవడం కూడా కష్టంగా మారింది. మా ఇంట్లో డయాలసిస్ పేషెంట్లున్నారు. వారి మందులకు కూడా పైసల్లేవు. ఎవరూ అప్పులు ఇవ్వకపోవడంతో బంగారం కుదువపెట్టిన.
- అఫ్జల్, డ్రైవర్, జీడిమెట్ల డిపో
కిరాణా సామాన్లు కొనలె..
ప్రతి నెలా జీతాలు లేట్గానే వస్తున్నయి. కరోనా టైంలోనూ రిస్క్ చేసి, డ్యూటీలు చేసినం. కానీ సకాలంలో శాలరీస్ పడ్తలేవు. తీసుకున్న లోన్లకు కిస్తీలు కట్టలేదు. దీంతో చెక్కులు బౌన్స్ అవుతున్నయి. ఫైన్లు పడుతున్నయి. ఇంట్లో కిరాణా సామాన్లు కూడా కొనలేకపోతున్నం. జీతాల కోసమే ఆశగా ఎదురు చూస్తున్నం.
- కృష్ణుడు, కండక్టర్, షాద్ నగర్ డిపో