- ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ తో అగ్రిమెంట్
- ఇయ్యాల్టి నుంచి 25 వరకు బుకింగ్స్
హైదరాబాద్, వెలుగు: మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు ఇంటికే ప్రసాదం అందించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఎండో మెంట్ డిపార్ట్ మెంట్ తో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దేవస్థానం నుంచి అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమ ఆర్టీసీ కార్గో ద్వారా భక్తులకు అందజేయనుంది. మేడారం మహా జాతర ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరుగుతుండగా.. బుధవారం నుంచి 25వ తేదీ వరకు ఆన్లైన్, ఆఫ్ లైన్ లో అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించింది.
భక్తులు రూ.299 చెల్లించి సమీపంలోని ఆర్టీసీ కార్గో ఏజెంట్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ల వద్ద మేడారం ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చని, https://rb.gy/q5rj68 లింక్ పై క్లిక్ చేసి లేదా పేటీఎం ఇన్ సైడర్ యాప్ లోనూ అమ్మవార్ల ప్రసాదాన్ని ఆర్డర్ ఇవ్వొచ్చని మంగళవారం ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆన్ లైన్ బుకింగ్ సమయంలో భక్తులు తమ సరైన చిరునామా, పిన్ కోడ్, ఫోన్ నంబర్ ను తప్పనిసరిగా నమోదుచేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. మేడారం ప్రసాదం బుకింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలకు సమీపంలోని లాజిస్టిక్స్ కౌంటర్లను గానీ, ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040 -69440069, 040 -69440000, 040 -23450033 లను సంప్రదించాలని ఆయన సూచించారు.
ఆర్టీసీ జేడీగా అపూర్వరావు బాధ్యతల స్వీకరణ
ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్, విజిలెన్స్ ఎస్పీగా అపూర్వరావు మంగళవారం హైదరాబాద్లోని బస్ భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన ఐపీఎస్ ల బదిలీల్లో అపూర్వరావుకు ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. 2014 బ్యాచ్కు చెందిన అపూర్వరావు వనపర్తి, గద్వాల, నల్గొండ ఎస్పీగా పనిచేశారు. తొలిసారి మహిళా అధికారిని ఆర్టీసీ జేడీగా నియమించటం అభినందనీయమని సంస్థ ఎండీ సజ్జనార్ అన్నారు.
