- ఆర్టీఐ ద్వారా పీఎంవో ఆఫీస్ వెల్లడి
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ 2014లో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఒక్క సెలవు కూడా తీసుకోలేదని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ప్రధాన మంత్రి ఆఫీస్(పీఎంవో) ఈ వివరాలు వెల్లడించిందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మోదీ ఎన్ని రోజులు ఆఫీసుకు వచ్చారు.. ఇప్పటి వరకు ఎన్ని ఈవెంట్లు, ఫంక్షన్లకు హాజరయ్యారంటూ ప్రపూల్ పి సర్దా అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా పీఎంవో ఆఫీసుకు దరఖాస్తు చేశాడు.
దీనికి బదులిస్తూ.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ ఇప్పటివరకు ఒక్క రోజు కూడా లీవ్ పెట్టలేదని తెలిపింది. మే 2014 నుంచి ప్రధాని మోదీ దేశ, విదేశాల్లో 3 వేల ఈవెంట్లకు హాజరయ్యారని రెండో క్వశ్చన్కు సమాధానం ఇచ్చింది. ఆర్టీఐ కాపీని సీఎం హిమంత బిశ్వ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ, ‘‘మై పీఎం.. మై ప్రైడ్” అని రాసుకొచ్చారు.