- 16 మంది మృతి.. 9 మంది మిస్సింగ్
- 130కిపైగా మందికి గాయాలు
- పరస్పరం దాడులతో ఇరుదేశాల్లో మరో ఐదుగురు మృతి
కీవ్/మాస్కో: ఉక్రెయిన్, రష్యా పరస్పరం వాణిజ్య కేంద్రాలపై దాడులకు పాల్పడుతున్నాయి. రష్యాలోని వైల్డ్ బెర్రీస్ రిటైల్ చైన్ సంస్థ వేర్హౌస్పై ఇటీవల భారీ ఎత్తున ఉక్రెయిన్ దాడి చేయగా.. శుక్రవారం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్స్కీ సొంత పట్టణమైన క్రివీ రిహ్లోని ఓ షాపింగ్ మాల్పై రష్యా డ్రోన్లతో వరుసగా రెండు సార్లు అటాక్ చేసింది.
షాపింగ్ మాల్పై దాడి ఘటనలో శనివారం నాటికి మృతుల సంఖ్య 16కు పెరగగా, 9 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. అలాగే ఈ ఘటనలో 130కిపైగా మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. క్రివీ రిహ్పై రష్యా డబుల్ టాప్ దాడి చేసిందని, ఇది ఉగ్రవాద చర్యేనంటూ జెలెన్స్కీ మండిపడ్డారు. ముందుగా ఒక డ్రోన్ల గుంపుతో దాడి చేశాక.. సహాయక చర్యలు కొనసాగుతుండగా మరో విడత డ్రోన్లతో దాడి చేయడం దారుణమన్నారు.
ఈ దాడి వల్ల 9 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య నాలుగున్నరేళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో క్రివీ రిహ్ అనేకసార్లు దాడులకు గురైంది. 2025 ఏప్రిల్లో జరిగిన దాడిలో 20 మంది మృతి చెందారు.
శుక్రవారం రాత్రి కీవ్లోని రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్పై రష్యా డ్రోన్, క్షిపణి దాడులు చేయడంతో ముగ్గురు మృతి చెందారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. అలాగే, రష్యాలోని క్రాస్నోడర్ ప్రాంతంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి జరపగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని అక్కడి అధికారులు వెల్లడించారు.
