- 8 రన్స్ తేడాతో శ్రీలంక-ఎపై విజయం
- ఆకట్టుకున్న తిలక్ వర్మ, బౌలర్లు
- కెప్టెన్ సహాన్ పోరాటం వృథా
దంబుల్లా: ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్న ఇండియా–ఎ జట్టు.. ముక్కోణపు వన్డే సిరీస్లో బోణీ చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (114 బాల్స్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 101), కెప్టెన్ తిలక్ వర్మ (60) చెలరేగడంతో.. మంగళవారం జరిగిన తొలి మ్యాచ్లో ఇండియా 8 రన్స్ స్వల్ప తేడాతో శ్రీలంక–ఎ జట్టుపై గెలిచింది. టాస్ నెగ్గిన ఇండియా 50 ఓవర్లలో 277/6 స్కోరు చేసింది. తర్వాత లంక 48.5 ఓవర్లలో 269 రన్స్కు ఆలౌటైంది. కెప్టెన్ సహాన్ అరాచ్చిగే (74) మెరుగ్గా ఆడాడు. గురువారం జరిగే మ్యాచ్లో ఇండియా... అఫ్గానిస్తాన్–ఎతో తలపడుతుంది.
- వైభవ్ ఫెయిల్..
ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. 16 రన్స్కే వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ (14), ప్రభ్సిమ్రన్ సింగ్ (2) పెవిలియన్కు వచ్చేశారు. ఈ దశలో రుతురాజ్ నిలకడగా ఆడి ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. రెండో ఎండ్లో ప్రియాన్షు ఆర్యా (32) కూడా బ్యాట్ ఝుళిపించాడు. ఈ ఇద్దరు క్రమం తప్పకుండా ఫోర్లు బాదడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. ఈ ఇద్దర్ని విడదీసేందుకు లంక బౌలర్లు వేసిన ఏ ప్రయత్నమూ సక్సెస్ కాలేదు. చివరకు మూడో వికెట్కు 53 రన్స్ జోడించి ప్రియాన్షు రనౌటయ్యాడు.
ఈ టైమ్లో వచ్చిన తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. రెండో ఎండ్లో రుతురాజ్ కూడా చెలరేగాడు. ఈ ఇద్దరు కలిసి దాదాపు 31 ఓవర్ల పాటు లంక బౌలింగ్ను ఉతికేశారు. ఈ క్రమంలో రుతురాజ్ లిస్ట్–ఎ కెరీర్లో 21వ సెంచరీ పూర్తి చేసుకోగా తిలక్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. నాలుగో వికెట్కు 150 రన్స్ జోడించి రుతురాజ్ వెనుదిరిగాడు. చివర్లో ఆయుష్ బదోనీ (24), సుర్యాన్ష్ షెడ్జే (26 నాటౌట్) కూడా వేగంగా ఆడారు. వీరిద్దరు కలిసి 58 రన్స్ జోడించడంతో ఇండియా మంచి టార్గెట్ను నిర్దేశించింది. మహ్మద్ షిరాజ్ 2 వికెట్లు తీశాడు.
- లంక చేజేతులా..
భారీ ఛేజింగ్లో లంకకు మంచి ఆరంభం లభించినా దాన్ని ఉపయోగించుకోలేకపోయారు. ఓపెనర్లు నిరోషన్ డిక్వెల్లా (47), అవిష్క ఫెర్నాండో (45) తొలి వికెట్కు 93 రన్స్ జోడించి మంచి పునాది వేశారు. అయితే స్వల్ప వ్యవధిలో ఇండియా స్పిన్నర్లు.. ఈ ఇద్దరితో పాటు నువానింద్ ఫెర్నాండో (8) ఔట్ చేయడంతో లంక 109/3తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో సదీరా సమరవిక్రమ (46), సహాన్ మెరుగ్గా ఆడారు. ఇండియా బౌలర్లను దీటుగా ఎదుర్కొని నాలుగో వికెట్కు 78 రన్స్ జోడించి ఇన్నింగ్స్ను పటిష్టం చేశారు.
ఇక ఫర్వాలేదనుకుంటున్న టైమ్లో అనుకూల్ రాయ్ (2/49) డబుల్ స్ట్రోక్ ఇచ్చారు. తన వరుస ఓవర్లలో సమరవిక్రమ, రవీందు ఫెర్నాండో (1)ను ఔట్ చేసి వికెట్ల పతనం మొదలుపెట్టాడు. ఆ తర్వాత చామిక కరుణరత్నే (9), వనుజా సహాన్ (23), విజయ్కాంత్ (5), మహ్మద్ షిరాజ్ (0), సహన్ వరుస విరామాల్లో వికెట్లు ఇచ్చుకున్నారు. ఆఖరి 10 బాల్స్లో చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా అర్షద్ ఖాన్ (2/24) చివరి ఓవర్లో రెండు వికెట్లు తీసి లంక ఓటమిని శాసించాడు.
సంక్షిప్త స్కోర్లు:
ఇండియా-ఎ: 50 ఓవర్లలో 277/6 (రుతురాజ్ గైక్వాడ్ 101, తిలక్ వర్మ 60,
మహ్మద్ షిరాజ్ 2/67).
శ్రీలంక-ఎ: 48.2 ఓవర్లలో 269 ఆలౌట్ (సహన్ అరాచ్చిగే 74, డిక్వెల్లా 47, అర్షద్ ఖాన్ 2/24, ఆయుష్ బదోని 2/46).
