ఖాతాల్లోకి రైతుబంధు పైసలు..తొలిరోజు ఎకరంలోపు రైతులకు రూ. 640 కోట్లు జమ

ఖాతాల్లోకి రైతుబంధు పైసలు..తొలిరోజు ఎకరంలోపు రైతులకు రూ. 640 కోట్లు జమ
  • తొలిరోజు ఎకరంలోపు రైతులకు రూ. 640 కోట్లు జమ

హైదరాబాద్, వెలుగు: రైతుబంధు పైసలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం షురూ చేశారు. సోమవారం నుంచే ఎకరాలోపు భూమి ఉన్న రైతులకు పంపిణీ ప్రారంభించినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. వానాకాలం సీజన్ మాదిరిగానే ఇప్పుడు యాసంగి సీజన్ కు కూడా అదే పద్ధతిలో డబ్బులను ఖాతాల్లో వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎకరంలోపు భూమి ఉన్న రైతులు దాదాపు 22 లక్షల మంది ఉండగా వారి బ్యాంక్ ఖాతాల్లో దాదాపు రూ. 640 కోట్ల మేరకు జమ చేసినట్టు వెల్లడించారు.

అయితే కొత్త ప్రభుత్వం రైతుబంధుపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సర్క్యులర్‌ విడుదల చేయలేదు. దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో సర్క్యులర్‌ వస్తుందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. సర్క్యులర్‌ వచ్చిన తర్వాత కొత్త వారికి స్కీం వర్తింపుపై గైడ్ లైన్స్ రూపొందించి, ఆ మేరకు పెట్టుబడి సాయం అందించనున్నారని పేర్కొంటున్నారు.