జైపూర్: అవినీతిపై తన పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ స్పష్టంచేశారు. బీజేపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన అవినీతిపై విచారణ జరుపుతామని ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత సర్కారుపై ఉందన్నారు. మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధరా రాజే హయాంలో జరిగిన కుంభకోణాలపై విచారణకు డిమాండ్ చేస్తూ జైపూర్లోని షహీద్ స్మారక్వద్ద సచిన్ పైలట్ మంగళవారం నిరసనకు దిగారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరాహార దీక్ష చేశారు. రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా.. ఇప్పటివరకు గత బీజేపీ సర్కారు అవినీతిపై విచారణ జరపలేదని మండిపడ్డారు. భూమాఫియా, మద్యం మాఫియా, మైనింగ్ మాఫియాలపై చర్యలు తీసుకోవాలని సీఎం అశోక్ గెహ్లాట్కు తాను రెండుసార్లు లేఖలు రాసినా స్పందించలేదన్నారు. రాజస్థాన్లో రూ.45 వేల కోట్ల మైనింగ్ స్కాం జరిగిందని ఆరోపించారు. గెహ్లాట్ సర్కారు స్పందించకపోవడం వల్లే తాను ఆందోళనకు దిగాల్సి వచ్చిందని చెప్పారు. నిరసన దీక్షకు దిగొద్దని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వం సచిన్ పైలట్ను హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం నిర్వహించినా, దాన్ని పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణిస్తామని చెప్పింది. అయినా పైలట్ వెనక్కి తగ్గలేదు. ఈ కార్యక్రమం కోసం వేదిక వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలపై కాంగ్రెస్ పార్టీ జెండాలు కానీ, గుర్తు కానీ కనిపించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ తన వర్గంతో కలిసి వేరుకుంపటి పెట్టుకోబోతున్నారా అనే కోణంలో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సీఎం గెహ్లాట్ 2030 ‘విజన్’ వీడియో
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మంగళవారం ఒక వీడియోను రిలీజ్ చేశారు. 2030 నాటికి రాజస్థాన్ను దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలిపేందుకు ఎటువంటి విజన్తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకుపోతున్నదనే విషయాన్ని అందులో వివరించారు. గత నాలుగేళ్ల బడ్జెట్తో పాటు ‘‘బచత్, రాహత్, బఢత్’’ నినాదంతో ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లు తన విజన్ ప్లాన్లో భాగమని సీఎం గెహ్లాట్ చెప్పారు. ఇతర ఏ రాష్ట్రాల్లోనూ లేని స్కీమ్స్ను రాజస్థాన్లో అమలు చేస్తున్నానని వీడియోలో తెలిపారు.