- సగటున 7.3 శాతం ఇంక్రిమెంట్ ఉంటుందన్న డెలాయిట్ సర్వే
- ఎక్కువగా లైఫ్ సైన్సెస్ సెక్టార్లో..తక్కువగా సర్వీస్ సెక్టార్లో
- 92 శాతం కంపెనీలు ఇంక్రిమెంట్ ఇవ్వనున్నాయి
న్యూఢిల్లీ: ఇండియన్ కంపెనీలు ఈ ఏడాది తమ ఉద్యోగుల జీతాలను పెంచనున్నాయి. కంపెనీలిచ్చే ఇంక్రిమెంట్ 2021 లో యావరేజ్గా 7.3 శాతానికి పెరగనుందని ఓ సర్వే పేర్కొంది. కిందటేడాది ఇది 4.4 శాతంగా ఉంది. సుమారు 92 శాతం కంపెనీలు ఈ ఏడాది శాలరీ హైక్ను చేపట్టాలని చూస్తున్నాయని డెలాయిట్ టచ్ టొహ్మట్సు ఇండియా(డీటీటీఐ) చేసిన సర్వేలో తేలింది. 2020 లో కేవలం 60 శాతం కంపెనీలు మాత్రమే శాలరీ హైక్ను ఇచ్చాయని తెలిపింది. 2021 వర్క్ఫోర్స్ అండ్ ఇంక్రిమెంట్ ట్రెండ్స్ సర్వే(ఫేజ్ 1) పేరుతో ఈ సర్వేను డెలాయిట్ నిర్వహించింది. డబుల్ డిజిట్లో ఇచ్చే ఇంక్రిమెంట్లు ఈ ఏడాది పెరుగుతాయని పేర్కొంది. 2021లో 20 శాతానికి పైగా కంపెనీలు డబుల్ డిజిట్ ఇంక్రిమెంట్ను ఇవ్వనున్నాయని, కిందటేడాది ఇది 12 శాతంగా ఉందని ఈ సర్వే పేర్కొంది. అంచనాలకు మించిన వేగంతో ఎకానమీ రికవరీ అవ్వడం, బిజినెస్లు తిరిగి సాధారణ స్థాయికి చేరుకోవడం, కన్జూమర్ల ఖర్చులు కూడా పెరగడంతో కంపెనీలు శాలరీ హైక్లను చేపడుతున్నాయి. కాగా, ఈ ఏడాది యావరేజ్ ఇంక్రిమెంట్ 7.3 శాతంగా ఉంటుందని ఈ సర్వే అంచనావేసింది. ఇది 2019 లో ఇచ్చిన 8.6 శాతం కంటే తక్కువ.
కరోనా టైమ్లో హైక్ కంటే జాబ్స్ కాపాడడంపైనే దృష్టి
‘బిజినెస్ యాక్టివిటీ వేగంగా రికవరీ అవుతోంది. శాలరీస్ వంటి ఫిక్స్డ్ కాస్ట్ను పెంచేందుకు కంపెనీలు తమ బడ్జెట్ను రెడీ చేసుకుంటున్నాయి’ అని డీటీటీఐ పార్టనర్ ఆనందోరూప్ ఘోష్ అన్నారు. కిందటేడాది శాలరీ హైక్ను ఇచ్చిన 60 శాతం కంపెనీలలో మూడో వంతు కంపెనీలు ఆఫ్ సైకిల్ ఇంక్రిమెంట్ విధానంలో శాలరీలను పెంచాయి. ఆఫ్ సైకిల్ ఇంక్రిమెంట్ అంటే ప్రమోషన్ లేకుండా శాలరీని మాత్రమే పెంచడం. కిందటేడాది మార్చి తర్వాత కంపెనీలు ఇచ్చే ఇంక్రిమెంట్లో మార్పులొచ్చాయి. ఉద్యోగుల శాలరీలను పెంచకూడదని కొన్ని కంపెనీలు నిర్ణయించుకోగా, కరోనా సంక్షోభం నుంచి బయటపడేంత వరకు వెయిట్ చేయాలని మరికొన్ని కంపెనీలు చూశాయి. 25 శాతం కంపెనీలు శాలరీ కోతను తమ సీనియర్ మేనేజ్మెంట్కు కూడా విస్తరించాయని ఘోష్ చెప్పారు. కొంత మందికి శాలరీ హైక్లివ్వడం కంటే ఎక్కువ మంది ఉద్యోగాలను కాపాడాలని కంపెనీలు అనుకున్నాయని పేర్కొన్నారు. ఇంకా కరోనా సంక్షోభం నుంచి బయటపడలేదు కాబట్టి కంపెనీలు ఆచితూచి అడుగులేయడంలో ఆశ్చర్యం లేదని అన్నారు.