
- ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా
న్యూఢిల్లీ: సబ్సిడరీలు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ పేమెంట్స్ వంటి కంపెనీల వ్యాపారాలను మరింత విస్తరించాక వీటిలో వాటాల అమ్మకాన్ని చేపడతామని స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) చైర్మన్ దినేష్ ఖారా అన్నారు. వీటి బిజినెస్లు పెరిగితే వాల్యుయేషన్ ఎక్కువ వస్తుందని, ఎస్బీఐకి మంచి రిటర్న్స్ వస్తాయని పేర్కొన్నారు. మార్కెట్ ద్వారానే తమ సబ్సిడరీ కంపెనీల్లో వాటాలను అమ్ముతామని వివరించారు.
భవిష్యత్లో వీటి వాటా అమ్మకాన్ని చేపడతామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాదని దినేష్ ఖారా అన్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్లో రూ.489.67 కోట్లను ఎస్బీఐ ఇన్వెస్ట్ చేసింది. ఈ కంపెనీ ఉద్యోగులకు ఈసాప్స్ను కూడా ఇచ్చింది. దీంతో ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్లో ఎస్బీఐ వాటా 69.95 శాతం నుంచి 69.11 శాతానికి తగ్గింది. ఎస్బీఐ పేమెంట్స్ సర్వీసెస్లో ఎస్బీఐకి 74 శాతం వాటా ఉంది.