కరోనా వ్యాక్సిన్ పేరుతో సెలైన్ వాటర్ ఇచ్చి ప్రజలను నిలువునా దోపిడి చేశారు కొందరు దుండగులు. ముంబైలోని కాండీవాలా ఏరియాలో ఉన్న ఓ హౌసింగ్ సొసైటీలో ఉంటున్న వ్యక్తులందరినీ టీకా వేస్తామంటూ ఓ ముఠా మోసం చేసింది. వ్యాక్సిన్ పేరుతో సెలైన్ వాటర్ ఇచ్చి పరారైనట్లు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 10 మందిని అరెస్టు చేసినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు. దీనికి సంబంధించి FIR నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కరోనా టీకా స్కాంలో దుండగులు బాధితులకు సెలైన్ వాటర్ ఇచ్చినట్లు భావిస్తున్నట్లు మంత్రి రాజేష్ తోపే తెలిపారు. బాధితులందరికీ జులైలో యాంటీబాడీ పరీక్షలు చేయిస్తామని తెలిపారు. దాన్ని బట్టి వారికి టీకా ఇవ్వలేదని తేలితే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి వారందరికీ రెండు డోసుల టీకా ఇచ్చేలా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
మొత్తం 2,040 మంది ఈ కుంభకోణంలో బాధితులుగా మిగిలారని మంత్రి తెలిపారు. దుండగులు పక్క రాష్ట్రం నుంచి టీకా బాటిళ్లు తెప్పించి దాంట్లో సెలైన్ వాటర్ నింపి ఉంటారని భావిస్తున్నామన్నారు.