ప్లాంట్​ మూసేస్తే 300 కుటుంబాలు రోడ్డుపాలు

ప్లాంట్​ మూసేస్తే 300 కుటుంబాలు రోడ్డుపాలు
  • డిసెంబర్​7 తో ముగియనున్న పీపీఏ గడువు 
  • కార్మికులను డ్యూటీలకు రావొద్దని నోటీసులు
  • ప్లాంట్​ మూసేస్తే 300 కుటుంబాలు రోడ్డుపాలు 
  • భూములమ్ముకొనే యోచనలో మేనేజ్​మెంట్​

 

మంచిర్యాల, వెలుగు :మంచిర్యాలలోని శాలివాహన  గ్రీన్ ఎనర్జీ, బయోమాస్ పవర్ ప్లాంట్ మూసివేతకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది డిసెంబర్ 7వ తేదీతో 20 ఏండ్ల పవర్ పర్చేజ్​అగ్రిమెంట్ (పీపీఏ) పూర్తికానుంది. దీంతో ప్లాంట్​ను మూసేందుకు మేనేజ్​మెంట్​ ప్లాన్​చేస్తోంది. ఇందులో భాగంగా మూడు నెలలుగా ఊక కొరత ఉందని కరెంట్​ఉత్పత్తి నిలిపివేసింది. ప్రభుత్వం దగ్గర రూ.8 కోట్లకు పైగా బిల్స్ పెండింగ్ ఉన్నాయని, ఉద్యోగులకు, వర్కర్లకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. డిసెంబర్ వరకు సగం జీతాలు ఇస్తామని, డ్యూటీలకు రావాల్సిన అవసరం లేదని నోటీసులు జారీ చేసింది. డిసెంబర్​తర్వాత ప్లాంట్​ను క్లోజ్​చేస్తే తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు.  

2002లో ప్రారంభం....  
మంచిర్యాలలోని రంగంపేటలో 6 మెగావాట్ల సామర్థ్యంతో 2002లో శాలివాహన గ్రీన్​ఎనర్జీ ప్లాంట్​ను ప్రారంభించారు. ఒక మెగావాట్​కు రూ.4 కోట్లు చొప్పున మొత్తం రూ.24 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేశారు. రైస్​మిల్లుల నుంచి వెలువడే ఊక, సింగరేణి బొగ్గు, కర్రపొట్టు, ఆయిల్​పామ్​ పొట్టుతో కరెంట్​ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి సప్లై చేసేవారు. కొన్నేండ్లుగా ఊక, పొట్టు కొరతతో పాటు ముడి ఇంధనాల రేట్లు పెరగడంతో పలుమార్లు కరెంట్ ఉత్పత్తిని నిలిపివేసిన సందర్భాలున్నాయి. మూడు నెలలుగా రైస్​మిల్లులు నడవకపోవడంతో ముడి ఇంధనాల్లో ప్రధానమైన ఊక కొరత ఏర్పడింది. రోజుకు 200 టన్నుల ముడి ఇంధనం అవసరం కాగా, 70 శాతం ఊకను వాడుతున్నారు. ఊక లేకపోవడంతో మూడు నెలలుగా ​ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే ప్రభుత్వం నుంచి నెలనెలా బిల్లులు రాకపోవడంతో ఉద్యోగులు, కార్మికులకు సక్రమంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. 

రోడ్డున పడనున్న వర్కర్లు 
ప్లాంట్​పై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 300 కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. ఇందులో రెగ్యులర్​ఉద్యోగులు, వర్కర్లు సుమారు 100 మంది ఉన్నారు. ట్రాక్టర్లు, లారీలు, ఇతర పనులు చేసేవారు మరో 200 మంది ఉన్నారు. వీరంతా 20 ఏండ్లుగా చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్నారు. రెగ్యులర్​గా జీతాలు ఇవ్వకున్నా ప్లాంట్​నే నమ్ముకుని బతుకుతున్నారు. డిసెంబర్​తర్వాత పవర్​ ప్లాంట్​ను క్లోజ్​చేస్తే తామంతా రోడ్డున పడుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది రిటైర్​మెంట్​కు దగ్గరలో ఉండడంతో ఈ వయసులో ఎట్లా బతకాలని వాపోతున్నారు. మూసివేత, ఉద్యోగులు, వర్కర్లకు సెటిల్​మెంట్​..లేబర్ ​యాక్టుల ప్రకారం జరగాల్సి ఉన్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.

రియల్​ వెంచర్​గా మారనుందా?
పవర్​ప్లాంట్​కు దాదాపు 40 ఎకరాల భూములుండగా, యాజమాన్యం ఇప్పటికే 10 ఎకరాలను అమ్ముకున్నట్టు సమాచారం. మిగిలిన 30 ఎకరాల్లో 11 ఎకరాల్లో ప్లాంట్ ​ఉంది. ఈ భూములు మంచిర్యాల పట్టణాన్ని ఆనుకుని ఉండడంతో డిమాండ్​ ఏర్పడింది. ఇక్కడ ఎకరం రూ.2 కోట్లకు పైగా పలుకుతోంది. ఒడిదుడుకుల మధ్య ప్లాంట్​ను నడపడం కంటే భూముల అమ్మకం ద్వారా ఏకకాలంలో భారీగా లబ్ధి పొందవచ్చనే ఆలోచనలో మేనేజ్​మెంట్​ఉన్నట్టు సమాచారం. అయితే గతంలో ప్లాంట్​కు అగ్గువకు భూములు ఇచ్చిన రైతులు తమ భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు.  

ఎమ్మెల్యేను కలిసిన వర్కర్లు
ప్లాంట్​ మూసివేత దాదాపు ఖాయమైన నేపథ్యంలో ఉద్యోగులు, వర్కర్లు శాలివాహన పరిరక్షణ సమితిగా ఏర్పడి ప్లాంట్​ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావును కలిసి పవర్ పర్చేస్ అగ్రిమెంట్(పీపీఏ)ను మరో పదేండ్లు పొడిగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 

పీపీఏ కోసం ప్రయత్నిస్తున్నాం
డిసెంబర్​7 నాటికి పీపీఏ గడువు ముగియనుంది. తిరిగి పీపీఏ కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ప్రభుత్వం సుముఖంగా లేదు. దేవాపూర్​, బసంత్​నగర్​లోని సిమెంట్​కంపెనీలను సంప్రదించినా ఫలితం లేదు. ప్రభుత్వం పొడిగిస్తే ప్లాంట్​ను నడిపిస్తాం.  
– శంకరయ్య, ప్లాంట్​ జనరల్​ మేనేజర్