
నాగచైతన్య, సమంత జంటగా నటించిన ‘ఏ మాయ చేశావే’ చిత్రం విడుదలై పదిహేనేళ్లు పూర్తయింది. జులై 18న సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో రీ రిలీజ్ ప్రమోషన్స్లో నాగచైతన్య, సమంత కలిసి పాల్గొనబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలపై సమంత స్పందించింది.
అవన్నీ రూమర్స్.. అందులో వాస్తవం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. ‘టీమ్ మెంబర్స్తో కలిసి నేను ఆ సినిమాను ప్రమోట్ చేయడం లేదు.. నిజం చెప్పాలంటే ప్రమోషన్స్కు నేను దూరంగా ఉంటున్నా. ఇలాంటి వార్తలను ఎవరు కల్పిస్తున్నారో తెలియడం లేదు. ఒకవేళ ఆ సినిమా అభిమానులు.. నటీనటులు కలిసి ప్రమోట్ చేస్తే చూడాలనుకొని ఉండొచ్చు. ఏదేమైనా ప్రేక్షకుల దృష్టి కోణంపై ఒకరి జీవితం ఆధారపడి ఉండదు’ అంటూ స్పష్టం చేసింది.
ఇక తన తొలిచిత్రం ‘మాస్కోవెన్ కావేరి’ అయినప్పటికీ రెండో చిత్రం ‘ఏ మాయ చేశావే’కు సంబంధించిన విషయాలే ఎక్కువ గుర్తున్నాయని, కెరీర్ ప్రారంభంలోనే గౌతమ్ మీనన్తో వర్క్ చేయడం సంతోషంగా ఉందని సమంత చెప్పింది.