రెండో సారి అమ్మిన రైతు కుటుంబం రిమాండ్
చౌటుప్పల్, వెలుగు: యాదాద్రి జిల్లా చౌటుప్పల్మండలం తూఫ్రాన్పేటలో ఒకే భూమిని రెండుసార్లు అమ్మిన రైతు కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులను, సా క్షులను, ప్లాట్లుగా మార్చిన భూమిని వ్యవసాయభూమిగా రిజిస్ట్రేషన్ చేసినందుకు అప్పటి సబ్ రిజిస్ట్రార్ను, డాక్యుమెంట్ రైటర్ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారిని రామన్నపేట కోర్టులో హజరు పర్చగా రిమాండ్ విధించి నల్లగొండ జైలుకు పంపారు. ఈ కేసులో ఇదివరకే రియల్ వ్యాపారులను అరెస్టు చేశారు.
ప్లాట్లు కొన్నవారి పోరాటంతో..
హైదరాబాద్ వ్యక్తులు భూమి చుట్టూ ప్రహరీగోడ నిర్మించడంతో సుబ్బరాజు దగ్గర ప్లాట్లు కొన్న దాదాపు వందమంది లబోదిబోమన్నారు. వారంతా కలిసి తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులకు, కలెక్టర్కు, గ్రామపంచాయతీకి మొరపెట్టుకున్నారు. చాలా ప్రయత్నాల తర్వాత గత ఏడాది చివర్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల తుఫ్రాన్పేటలో వెలుగు చూసిన భూదందాపై దృష్టిపెట్టిన ఎస్వోటీ పోలీసులు సోమవారం రాత్రి రైతు కుటుంబానికి చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారించారు. వీరితో పాటు అప్పట్లో చౌటుప్పల్ సబ్రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్ సత్యనారాయణ, సాక్షులు బండారి, పెద్దిరాజు, రెండో సారి భూమి కొనుగోలు చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేశారు. రెండోసారి భూమి కొన్న హైదరాబాద్ వ్యాపారులు ఈ భూమికి పట్టాదారు పాసుబుక్కుల కోసం స్థానిక లీడర్లతోనూ, రెవెన్యూ ఆఫీసర్లతోనూ బేరసారాలకు దిగినట్టు తెలుస్తోంది. పాస్బుక్కుల కోసం భారీ మొత్తాలను ఆఫర్ చేశారన్న ప్రచారం జరుగుతోంది.
ఇదీ మరో మాయ..
తూఫ్రాన్పేటలోనే ఓ వెంచర్లో కట్టిన ఇండ్లను అప్పనంగా అమ్మేసుకునేందుకు అక్రమార్కులు స్కెచ్ వేశారు. 15ఏండ్ల కిందట 375,376,382,383 సర్వే నెంబర్లలోని దాదాపు 15ఎకరాల్లో ఈ వెంచర్ ఏర్పాటైంది. దీన్ని ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖులు వారే దాదాపు 60 ఇండ్లను కట్టి అమ్మారు. హైదరాబాద్ కు చెందిన వారు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని ఫ్లాట్లను కొనుగోలు చేశారు. వారిలో కొందరు బ్యాంకు ఇన్స్టాల్మెంట్లు కట్టకపోవడంతో వాటిని వేలం వేశారు. వేలంలో ఇండ్లు కొనుక్కున్న వారు రిపేర్లు చేయించుకుని ఉంటుండగా, మరికొన్ని ఇండ్లు శిథిలావస్థకు చేరాయి. ఖాళీగా ఉన్న ఇండ్లమీద తూఫ్రాన్పేట రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడింది. నకిలీ డాక్యుమెంట్లు రెడీ చేసి వాటిని అమ్మేందుకు సిద్దపడ్డారు.
జీపీఏ హోల్డర్తోనే మళ్లీ రిజిస్ట్రేషన్లు
2006లో ఏర్పాటైన ఈ వెంచర్కు సంబంధించి శ్రీనివాసరావు పేర జీపీఏ చేశారు. ఆయనే ప్లాట్లను, ఇండ్లను రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు. ఖాళీ ఇండ్లమీద కన్నేసిన అక్రమార్కులు తాజాగా శ్రీనివాసరావుతోనే కలిసి అమ్మకానికి తెరతీశారు. ఖాళీగా ఉన్న ఐదు ఇండ్లను పక్క సర్వే నంబరుతో నలుగురు వ్యక్తులు శ్రీనివాసరావుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నిజానికి ఈ సర్వే నంబరులో ప్లాట్లు గానీ, ఇండ్లు గానీ లేవు. రిజిస్ట్రేషన్ చేసినందుకు ఒక్కో ఇంటికి రూ.50వేలు చెల్లించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఇళ్లకు పెయింట్ వేసి రీసేల్ చేసేందుకు సిద్దం చేయడంతో అంతకు ముందు కొనుక్కున్న వారు హైరానా పడుతున్నారు. తన ఇంటిని ఇతరులు రిపేరు చేయించి రంగులు వేశారంటూ ఖమ్మంకు చెందిన ఓ వ్యక్తి చౌటుప్పల్ పోలీసులకు, ఎస్వోటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సరైన సర్వే నంబర్లు లేకపోవడంతో కేసు పెట్టలేదు.
టీఆర్ఎస్ నేత ప్లాట్కు ఫేక్ డాక్యుమెంట్
ఫేక్ ఐడీలతో భూముల దందాకు సంబంధించిన అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న తుఫ్రాన్పేట ఉపసర్పంచ్ భర్త ఏనుగు మాధవరెడ్డి ఇంట్లో 50కి పైగా డాక్యుమెంట్లు దొరికినట్టు తెల్సింది. ఆ డాక్యుమెంట్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టీఆర్ఎస్నుంచి నల్లగొండ లోకసభ అభ్యర్థిగా పోటీచేసిన వేమిరెడ్డి నర్సింహారెడ్డికి ప్లాటుకు కూడా ఫేక్ డాక్యుమెంట్సృష్టించినట్టు తేలింది. నర్సింహ్మారెడ్డి తన భార్య ఇందిర పేరిట బక్కతట్ల మల్లేశ్ నుంచి 2008లో 534గజాల ఫ్లాట్ను రూ.10లక్షలకు కొన్నారు. మల్లేశ్అంతకుముందు దీన్ని సికింద్రాబాద్కు చెందిన యార్లగడ్డ శ్రీలక్ష్మీ నుంచి కొనుగోలు చేశారు. అయితే 2016లో యార్లగడ్డ శ్రీలక్ష్మీ పేరుతో వేరే మహిళ ఫొటోను పెట్టి అక్రమాకులు ఫేక్ ఐడీని సృష్టించారు. అప్పుడే నకిలీ డాక్యుమెంట్లతో పరిదం శేఖర్, ఏనుగు మాధవరెడ్డి ఆప్లాటును తమ పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
అసలేం జరిగిందంటే..
తూఫ్రాన్పేటకు చెందిన ముద్దం నర్సింహకు 33,34,35 సర్వే నంబర్లలో 6.17 ఎకరాల భూమి ఉంది. అతనికి వెంకటయ్య, అంజయ్య ఇద్దరు కొడుకులు. వీరు ముగ్గురు కలిసి 1996లో తమ భూమిని గ్రీన్ సిటీ వెంచర్కు అమ్మేశారు. వెంచర్ ఓనర్ సుబ్బరాజు పేర జీపీఏ చేయగా ఆయన భూమిని ఫ్లాట్లుచేసి అమ్ముకున్నాడు. కొంతకాలానికి నర్సింహులు, 2010లో అంజయ్య చనిపోయారు. ఆ తర్వాత వెంకటయ్య, అతని భార్య అండాలు, అంజయ్య భార్య జంగమ్మ, ఆమె కొడుకులు శేఖర్, రవి కలిసి సుబ్బరాజుకు చేసిన జీపీఏను క్యాన్సిల్ చేసి, పాత పుస్తకాల ఆధారంగా ఫౌతీ చేయించుకున్నారు. బీబీనగర్ మండలం రాఘవపురానికి చెందిన మాజీ నక్సలైట్ నయీం అనుచరుడు కొర్ని మహేష్ఈ భూమి కొనుక్కుని తన పేర జీపీఏ చేసుకున్నాడు. హైదరాబాద్కు చెందిన ఇద్దరికీ మూడెకరాల చొప్పున అమ్మాడు. భూమి కొనుకున్నవారు కాంపౌండ్వాల్ కట్టుకుని లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేశారు. గత ఏడాది మహేష్ కూడా చనిపోయాడు.
కేసుల భయంతో రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్
భూదందా మీద పోలీసులు సీరియస్గా కదలడంతో ఐదు ఇండ్లను రిజిస్టేషన్ చేసుకున్న వారిలో వణుకు మొదలైంది. భూదందాలో ఏడుగురు అరెస్టు కావడంతో ఈ ఇండ్లను తమపేర రాయించుకున్న వారు తిరిగి శ్రీనివాసరావును పట్టుకుని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయించుకున్నారు. 1984, 1985,1986,1987 నంబర్లతో ఉన్న డాక్యుమెంట్లు క్యాన్సిల్ అయ్యాయి.