ఆర్నెళ్లుగా అదే టెన్షన్

ఆర్నెళ్లుగా అదే టెన్షన్

గ్రేటర్​లో కంట్రోల్ ​అవ్వని కరోనా

మార్చి 2 న మొదటి కేసు

ఇప్పటివరకు అధికారికంగా 51వేల మందికిపైగా పాజిటివ్

లెక్కకి రాని కేసులు వేలల్లో..

నిర్లక్ష్యం వీడని బల్దియా

హైదరాబాద్, వెలుగు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ సిటీలో మకాం వేసి ఆరు నెలలవుతోంది. మార్చి రెండున తొలి కేసు నమోదైంది. సిటీకి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దుబాయ్​లోని కంపెనీలో హాంకాంగ్​వాసులతో కలిసి పని చేయడం వల్ల వైరస్​ బారిన పడ్డారు. ఇలా వేరే దేశం నుంచి మొదట సిటీలోకి వైరస్​ ఎంటర్ అయింది. అదే నెల 14న మరో రెండు కేసులు వచ్చాయి. మొత్తంగా ఆరు నెలల్లో 51వేలకిపైగా నమోదైనట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఆగస్టులో వైరస్ ​వ్యాప్తి, కేసులు తగ్గుతాయని హెల్త్​ మినిస్టర్​, డీఎంఈ చెప్పగా, అదే నెలలో 12,791 కేసులు వచ్చాయి. వాస్తవానికి అంతకు మించే కేసులున్నా బులిటెన్​లో తక్కువ చేసి చూపిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుల లెక్కలు పలుమార్లు స్పష్టం చేశాయి. కరోనా కట్టడి కోసం సెంట్రల్​టీమ్​ ఆదేశాలతో కంటైన్​మెంట్​ జోన్లు ఏర్పాటుచేసిన నిర్వహణను బల్దియా  గాలికొదిలేసింది.

6లక్షలు దాటాయన్న సీసీఎంబీ…

ప్రభుత్వం విడుదల చేస్తున్న బులిటెన్​ ప్రకారం.. జీహెచ్​ఎంసీ పరిధిలో మార్చిలో 25 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏప్రిల్​లో 519, మేలో 876, జూన్ లో 11,080, జూలై లో 26,082, ఆగస్టులో 12791 పాజిటివ్​ కేసులు వచ్చాయి. అంతకు మించే కేసులు వస్తున్నా, లెక్క తక్కువ చేసి చూపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గ్రేటర్​లో 6 లక్షల మందికిపైనే కరోనా వచ్చినట్లు సెంటర్​ఫర్​ సెల్యులర్​అండ్​ మాలిక్యులర్​ బయాలజీ(సీసీఎంబీ) గత నెలలోనే పేర్కొంది. జిల్లావైద్యాధికారులు, సర్కారు బులిటెన్​ లెక్కలకు తేడాలు కూడా చాలాసార్లు బయటపడ్డాయి. గవర్నమెంట్​ హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఏర్పాటుచేసిన టెస్టింగ్​ సెంటర్లలో రద్దీ ఎక్కువ ఉండడం, వివిధ కారణాలతో టెస్టులు చేయకపోవడంతో చాలామంది ప్రైవేట్​లో టెస్టులు చేయించుకుంటున్నారు. మరికొందరు ల్యాబ్ టెక్నిషియన్లను ఇంటికే పిలిపించుకుని శాంపిల్స్​ ఇస్తున్నారు. ఆ లెక్కలేవీ పూర్తిస్థాయిలో యాడ్​ అవడం లేదు.

కంటైన్​మెంట్​ జోన్ల నిర్వహణ అంతంతమాత్రమే..

కరోనాను కంట్రోల్​ చేసుందుకు ఏప్రిల్ లో వైరస్​ వ్యాప్తి ఎక్కువగా 12 ఏరియాల్లో బల్దియా కంటైన్​మెంట్​ జోన్లు ఏర్పాటుచేసింది. ఆ తర్వాత కూడా కేసులు ఎక్కువగా వస్తుండడంపై హైకోర్టు, సెంట్రల్​ టీమ్​ సీరియస్​ అవడంతో వాటి సంఖ్యను 92కి పెంచింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 65 కంటైన్​మెంట్​ జోన్లు యాక్టివ్ గా ఉన్నాయి. వాటి పర్యవేక్షణకు కమిషనర్​ ప్రత్యేకాధికారులను కూడా నియమించారు. అయినా వాటి నిర్వహణను గాలికొదిలేశారు. దాంతో ఆ ఏరియాల్లో పాజిటివ్ ​పేషెంట్లు కూడా బయటికి వస్తున్నారు. హోం క్వారంటైన్​ అయ్యేందుకు ఇంట్లో వసతి లేని వాళ్ల కోసం ఐసోలేషన్​ సెంటర్లు ఏర్పాటుచేయాలని హై కోర్టు ఆదేశించినా, ఇప్పటిదాకా 4 సెంటర్లు మాత్రమే ఏర్పాటుచేశారు. దాంతో పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. అన్​లాక్​ మొదలవడం, అధికారులు చేతులెత్తేయడంతోపాటు జనం రోడ్లపై ఇష్టానుసారంగా తిరుగుతుండటంతో గ్రేటర్ లో కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి.