కామారెడ్డి, ఎల్లారెడ్డిల అభివృద్ధికి ..రూ.90 కోట్లు : మంత్రి కేటీఆర్

కామారెడ్డి, ఎల్లారెడ్డిల అభివృద్ధికి ..రూ.90 కోట్లు : మంత్రి కేటీఆర్
  • ఎల్లారెడ్డికి మరో 3 వేల గృహలక్ష్మి ఇండ్లు శాంక్షన్​ చేస్తాం
  • మంత్రిగా ఉన్నప్పుడు షబ్బీర్​ అలీ ఎందుకు మెడికల్ కాలేజీ తీసుకురాలే
  • రాష్ట్ర ఐటీ, మున్సిపల్​ శాఖల మంత్రి కేటీఆర్​

కామారెడ్డి/ ఎల్లారెడ్డి, వెలుగు : కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం రూ.90 కోట్ల ఫండ్స్​శాంక్షన్​ చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, మున్సిపల్​శాఖల మంత్రి కేటీఆర్​ప్రకటించారు. సోమవారం జిల్లాలో మంత్రి పర్యటించారు. కామారెడ్డి టౌన్​లో రూ.28 కోట్లతో చేపట్టిన రోడ్డు వెడల్పు, సెంట్రల్​ లైటింగ్, స్వాగత తోరణాలను ప్రారంభించారు. అనంతరం ఎల్లారెడ్డి టౌన్​లో రూ. 60 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తాడ్వాయిలో రూ.2 కోట్లతో చేపట్టే స్టేడియానికి కూడా శంకుస్థాపన చేశారు.

కామారెడ్డి టౌన్​లో అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం కేటీఆర్​ మాట్లాడుతూ.. జిల్లా  కేంద్రం కామారెడ్డిని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇక్కడ డెవలప్​మెంట్​వర్క్స్​కోసం స్పెషల్ ఫండ్స్​ కింద రూ.25 కోట్లు, మున్సిపల్​శాఖ ద్వారా స్టేడియంలో మరిన్ని పనులు, స్పోర్ట్స్​కాంప్లెక్స్​ నిర్మాణానికి  రూ.20 కోట్లు శాంక్షన్​చేస్తున్నట్లు ప్రకటించారు. 

సురేందర్​ను గెలిపించాలే..

ఎల్లారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాలకు రూ.20 కోట్లు, మున్సిపాలిటీతో పాటు, మేజర్ ​పంచాయతీల్లో అభివృద్ధి పనుల కోసం రూ. 25 కోట్లు శాంక్షన్​ చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన జీవోను మంత్రి స్టేజీ మీద ఎమ్మెల్యే సురేందర్​కు అందించారు. గృహలక్ష్మి కింద ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు ఇచ్చామని, అదనంగా మరో 3 వేల ఇండ్లు ఇస్తామన్నారు. 2001 నుంచి 2004 మధ్య తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జాజాల సురేందర్ ​కేసీఆర్ వెన్నంటి నిలిచారన్నారు. 2004లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి, దక్కకపోవడంతో పార్టీ మారారని, కేసీఆర్ ​మీద అభిమానంతో తిరిగి సొంత గూటికే చేరారన్నారు.

వచ్చే ఎన్నికల్లో సురేందర్​ను 70 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ ​కోరారు. కామారెడ్డిలో కాంగ్రెస్​ నేత షబ్బీర్​అలీ బాగా మాట్లాడుతున్నారని, మరి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీ ఎందుకు తీసుకురాలేకపోయారని కేటీఆర్ ​ప్రశ్నించారు. మంత్రి  వేముల ప్రశాంత్​రెడ్డి మాట్లాడుతూ.. తన నియోజకవర్గం బాల్కొండ తర్వాత ఎల్లారెడ్డికే తాను ప్రయార్టీ ఇస్తున్నట్లు చెప్పారు. విప్​ గంపగోవర్ధన్​, జడ్పీ చైర్​పర్సన్ ​దఫేదర్ ​శోభ, జహీరాబాద్​ ఎంపీ బీబీ పాటిల్, రాజ్యసభ మెంబర్​ సురేశ్​రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్​ తదితరులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిపై క్లారిటీ.. కామారెడ్డిపై నో..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ​తరఫున పోటీచేసే అభ్యర్థుల విషయంలో  కేటీఆర్ ​ఆయా చోట్ల స్పష్టత ఇస్తున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ టికెట్​ విషయంలో స్పష్టత ఇచ్చినప్పటికీ, కామారెడ్డి విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఎల్లారెడ్డిలో  జాజాల సురేందర్​ను 70 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని సూచించారు. కామారెడ్డిలో మంత్రి కొద్దిసేపు మాట్లాడినా ఇక్కడ పొలిటికల్ అంశాలను ప్రస్తావించలేదు.

కేవలం ఫండ్స్​ శాంక్షన్​చేస్తున్నట్లు ప్రకటించారు. కామారెడ్డి నుంచి కేసీఆర్​ను పోటీ చేయాలని తాను కోరినట్లు ఇటీవల స్థానిక ఎమ్మల్యే గంప గోవర్ధన్, కేటీఆర్ క్లారిటీ ఇస్తారేమోనని కార్యకర్తలు వేచి చూశారు. కానీ ఆయన నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.