ఇంకామేం ప్రాజెక్టు పనులే మొదలు పెట్టలేదు
ఎన్జీటీలో ఏపీ సర్కార్ అఫిడవిట్
హైదరాబాద్, వెలుగు: సంగమేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్జీటీ) పరిధిలోకే రాదని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఏపీ, తెలంగాణ మధ్య ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ను పర్యావరణ అంశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు ఏపీ సర్కార్ ఎన్జీటీలో కౌంటర్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ పెంపుకు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేవని, వాటిని అడ్డుకోవాలని కోరుతూ నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్ అఫిడవిట్ ఫైల్ చేశారు.
పాలమూరు రంగారెడ్డికే అనుమతుల్లేవ్
కృష్ణా నదిలో లభ్యమయ్యే నీటిని ప్రాజెక్టుల వారీగా వినియోగించుకునేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయని, నీటి వినియోగాన్ని కేఆర్ఎంబీ పర్యవేక్షిస్తోందని ఏపీ జలవనరుల శాఖ సీఎస్ తెలిపారు. పిటిషనర్ పేర్కొన్న పాలమూరు రంగారెడ్డికే తుది పర్యావరణ అనుమతులు లేవని, తెలంగాణ ప్రభుత్వం అనధికారింగా ఆ ప్రాజెక్టును చేపడుతోందని ఎన్జీటీకి వివరించారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మధ్యలోంచి వెళుతోందని, ఇప్పటికీ దానిపై పబ్లిక్ హియరింగ్ నిర్వహించలేదని వాదించారు. శ్రీశైలం ఫోర్షోర్ నుంచి రోజూ 3 టీఎంసీలు ఎత్తిపోయడానికి రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టులో భాగంగా పంపుహౌస్, అప్రోచ్ చానల్ తవ్వుతున్నామని, వాటి వల్ల ఎలాంటి ముంపు ఉండబోదన్నారు. ఇంటర్స్టేట్ జలవివాదాన్ని పర్యావరణ సమస్యగా మారుస్తున్నారని ఆరోపించారు.
అన్ని అనుమతులు తీసుకుంటం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి ముందు పర్యావరణ అనుమతుల కోసం తాము నోటిఫికేషన్ జారీ చేస్తామని ఏపీ జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్ వెల్లడించారు. ఇంకా ఎలాంటి పనులు ప్రారంభించలేదు కాబట్టి నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. కృష్ణా జలాల్లో తమ రాష్ట్రానికి ఉన్న కేటాయింపుల మేరకు కొత్తగా చేపట్టే ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకుంటామని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 841 అడుగులకు పడిపోతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నీటిని తీసుకునే అవకాశంలేదని తెలిపారు. అందుకే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును చేపడుతున్నామని పేర్కొన్నారు.
For More News..