
సంగారెడ్డి టౌన్ , వెలుగు: మునిసిపల్, మెప్మా ఆధ్వర్యంలో వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం సంగారెడ్డి పట్టణంలోని ప్రశాంతనగర్ కాలనీలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ ను, కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వీధి విక్రయదారులు తమ ప్రతిభను ప్రజలకు పరిచయం చేయడానికి స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్స్ వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. శుభ్రతతో కూడిన నాణ్యమైన పదార్థాలకు డిమాండ్ ఉంటుందన్నారు. సంగారెడ్డి పట్టణంలోని వివిధ సంస్థల్లో వారి ఉత్పత్తులను విక్రయించడానికి అవసరమైన చర్యలను చేపట్టాలని మెప్మా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పీడీ మెప్మా గీత, మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
భూ భారతితోనే భూ సమస్యలకు చెక్
నారాయణ్ ఖేడ్: భూభారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. గురువారం నిజాంపేట్ మండలం రాంరెడ్డి పేటలో నిర్వహించిన భూభారతి సదస్సులో పాల్గొని మాట్లాడారు. భూభారతి యాప్ లో రిజిస్టర్ అయిన కంప్లైంట్ సమస్య స్థాయిని బట్టి వంద రోజుల్లోపు పరిష్కారమవుతుందన్నారు. పలువురు రైతులతో మాట్లాడి వారి సమస్యల గురించి తెలుసుకున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. రాంరెడ్డి పేట గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం నిజాంపేట్ లోని ఓ ఫర్టిలైజర్ షాప్ ను తనిఖీ చేసి రైతులకు క్వాలిటీ ఫర్టిలైజర్స్,పెస్టిసైడ్స్ సప్లై చేయాలన్నారు. గ్రామంలో ఉన్న రేషన్ డీలర్ షాప్ ని తనిఖీ చేసి బియ్యం పంపిణీ విధానాన్ని చెక్ చేశారు.