- కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి టౌన్, వెలుగు: క్లెయిమ్ చేయని డబ్బు నిజమైన ఖాతాదారులకు అందించడమే లక్ష్యంగా మీ డబ్బు -మీ హక్కు అనే ప్రత్యేక జాతీయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. శనివారం సంగారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్కలెక్టర్ మాధురి, బ్యాంక్ అధికారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ బ్యాంకుల్లో పదేళ్లకు పైగా క్లెయిమ్ చేయని డిపాజిట్లను వారి ఖాతాదారులకు చెల్లించాల్సిన బాధ్యత సంబంధిత బ్యాంకులదే అన్నారు.
జిల్లాలోని 17 బ్యాంకుల్లో మొత్తం 2,36,123 ఖాతాలకు సంబంధించి రూ.51.07 కోట్ల విలువైన క్లెయిమ్ చేయని ఆస్తులు ఉన్నాయన్నారు. అక్టోబర్ నుంచి ఇప్పటివరకు రూ.2 కోట్లను ఖాతాదారులకు చెల్లించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు మూడు నెలల పాటు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. క్లెయిమ్ చేయని పొదుపు డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా పాలసీలు తదితర ఆర్థిక ఆస్తులపై ప్రజలకు అవగాహన కల్పించి వాటిని సులభంగా క్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని సంగారెడ్డి జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ నర్సింగ్ రావు తెలిపారు.
బ్యాంకుల్లో పదేళ్లకు పైగా క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలను ఆర్బీఐ నిర్వహిస్తున్న ఉద్గమ్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఆర్బీఐ ఏజీఎం రెహమాన్, ఎండీసీసీబీ సీఈవో శ్రీనివాస్, యూబీఐ ఏజీఎం శ్రీనివాస్, వివిధ బ్యాంకుల సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు. ఈ నెల 22న ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. గెజిటెడ్ ఉద్యోగ సంఘం నాయకులు కలెక్టర్ ప్రావీణ్యను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
