
కేంద్రానికి శివసేన నేత సంజయ్ రౌత్ చురకలు
ముంబై: ప్రధాని మోడీ 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆత్మనిర్భర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దిగుమతుల కంటే ఎగుమతుల మీదే దృష్టి సారించాలన్నారు. మన ప్రతిభ మీద నమ్మకం ఉంచాలన్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన లీడర్ సంజయ్ రౌత్ స్పందించారు. రష్యా తొలి కరోనా వ్యాక్సిన్ను రూపొందించి ఆత్మనిర్భర్ గురించి ప్రపంచానికి పాఠాలు నేర్పిందని చురకలు అంటించారు. వ్యాక్సిన్పై రష్యాను ప్రశంసిస్తూ శివసేన మౌత్పీస్ అయిన సామ్నాలో కాలమ్ రాశారు. అందులో రష్యా సూపర్ పవర్ అవుతోందనడానికి ఇది సంకేతమన్నారు. దీన్ని ఇండియా రాజకీయాలకు అనునయిస్తూ రష్యాను మనం ఉదాహరణగా అనుసరించమని.. ఎందుకంటే అమెరికాతో ప్రేమలో పడ్డామన్నారు.
‘రష్యా వ్యాక్సిన్ అక్రమం అని నిరూపించడానికి ప్రపంచవ్యాప్తంగా యత్నాలు ఆరంభమైన నేపథ్యంలో పుతిన్ వ్యాక్సిన్ను తన కూతురిపై ప్రయోగించడం ద్వారా ఆత్మనిర్భర్ను స్వదేశంలో ప్రారంభించారు’ అని రౌత్ చెప్పారు. రామ మందిర ట్రస్ట్ హెడ్ మహంత్ నృత్య గోపాల్ దాస్కు కరోనా సోకిందన్నారు. భూమి పూజలో పాల్గొన్న మోడీకి దాస్ హ్యాండ్ షేక్ చేశారని.. మరి ప్రధాని సెల్ఫ్ క్వారంటైన్లోకి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.