Sanju Samson: భారత జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ అరుదైన రికార్డులను నెలకొల్పాడు. టీ20 వరల్డ్ కప్ ఒకే ఎడిషన్లో సెమీ ఫైనల్, ఫైనల్లో హాఫ్ సెంచరీలు బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్తో జరిగిన సెమీస్, కివీస్ తో జరిగిన ఫైనల్లో సంజు అర్థ శతకాలు చేశాడు. ఇప్పటివరకు ఈ ఘనతను కొందరు ప్లేయర్స్ మాత్రమే సాధించారు. ఇప్పుడు ఈ జాబితాలో సంజు కూడా చోటు దక్కించుకున్నాడు.
తొలిసారి షాహిద్ ఆఫ్రిది: ఈ అరుదైన రికార్డును తొలిసారి పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది అందుకున్నాడు. 2009 టీ20 వరల్డ్ కప్లోని సెమీ ఫైనల్, ఫైనల్లో ఆఫ్రిది అర్ధ శతకాలు నమోదు చేశాడు. ఆఫ్రిది కీలక ఇన్నింగ్స్లతో పాకిస్తాన్ ఆ ఏడాది టీ20 వరల్డ్ కప్ను గెలుచుకుంది. షాహిద్ ఆఫ్రిది తర్వాత ఈ ఘనతను టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ అందుకున్నాడు. 2014 టీ20 వరల్డ్ కప్లో కోహ్లీ సెమీఫైనల్ అండ్ ఫైనల్ మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే ఫైనల్లో భారత్ ఓడిపోవడంతో కోహ్లీ ప్రదర్శన వృథా అయింది. టీ20 వరల్డ్ కప్ 2026లో సంజు శాంసన్ కూడా ఈ ఘనత సాధించాడు. సెమీఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన సంజు.. ఫైనల్లో కూడా మరోసారి హాఫ్ సెంచరీ సాధించి జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో టీ20 వరల్డ్ కప్ ఒకే ఎడిషన్లో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో సంజు మూడో ఆటగాడిగా నిలిచాడు.
సంజు శాంసన్ రికార్డులు:
* టీ20 వరల్డ్ కప్ 2026 ఎడిషన్ లో ఇండియా తరపున ఎక్కువ ( 321) పరుగులు
* టీ20 ప్రపంచకప్ 2026 సీజన్ లో ఎక్కువ (24) సిక్సులు కొట్టిన ఆటగాడు
* టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్స్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 89
* టీ20 ప్రపంచ కప్ లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు చేసిన 3వ భారతీయుడు
