
మెదక్, కొల్చారం, వెలుగు: అన్ని హంగులతో సంస్కృత యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని హయ్యర్ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. బుధవారం కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్ కలెక్టర్ రమేశ్, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్ వెంకటరమణ, మహారాష్ట్రలోని రామ్ టెక్ సాంస్కృతిక వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ మధుసూదన్, ఓయూ సాంస్కృతిక అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ నీలకంఠం, కాలేజీ ఎడ్యుకేషన్ రీజినల్ జాయింగ్ డైరెక్టర్ డా. యాదగిరిలతో వర్సిటీ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు.
కొల్చారంలో రెవెన్యూ అధికారులు గుర్తించిన 30 ఎకరాలు, మరోచోట 27 ఎకరాల స్థలాన్ని పరిశీలించి వర్సిటీ నిర్మాణంపై చర్చించారు. అనంతరం లింబాద్రి మాట్లాడుతూ సాహిత్య రంగంలో మెదక్ జిల్లాకు వన్నె తెచ్చిన మల్లినాథసూరి స్వస్థలమైన కొల్చారంలో సంస్కృత యూనివర్సిటీ ఏర్పాటుకు కార్యాచరణ చేపట్టాలని సీఎం కేసీఆర్ విద్యా శాఖను ఆదేశించారని చెప్పారు. విద్యా శాఖ మంత్రి సూచనల మేరకు కొల్చారంలో రెండు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించామని, వర్సిటీకి ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు.