ఓ అపార్ట్మెంట్లో దాచిన దాదాపు లారీ చీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోడ అమలులో ఉండడంతో పోలీసులు అధికారులు తనిఖీలు ముమ్మురం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భారీగా నగదు, బంగారం, వెండి ఆభరణాలు వంటి విలువై వస్తువులు పట్టుబడుతున్నాయి. తాజాగా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో పంచవటి అపార్ట్మెంటులో.. ఓటర్లకు పంచేందుకు పెద్ద ఎత్తున చీరలు దాచినట్లు సమాచారం అందడంతో పోలీసులు, నిజాంపేట నగరపాలక సంస్థ అధికారులు దాడులు చేసి.. లారీ చీరలను స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం సరుకు విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు అధికారులు భావిస్తున్నారు. ఈ చీరల లోడ్ ను వరంగల్ నుంచి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి.. చీరల లారీని బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.