దివ్యాంగుడిపై పుల్సోనిపల్లి సర్పంచ్​ వీరంగం

దివ్యాంగుడిపై పుల్సోనిపల్లి సర్పంచ్​ వీరంగం

మహబూబ్​నగర్, వెలుగు : ఉపాధి హామీ పథకం డబ్బులను ఇవ్వాలని అడిగిన ఓ దివ్యాంగుడిని అధికార పార్టీకి చెందిన సర్పంచ్ బూతులు తిట్టాడు. ‘నన్నే ఎదిరించి మాట్లాడతావా రా’  అంటూ కాలితో తన్నాడు. ఈ ఘటన మహబూబ్​నగర్​జిల్లా హన్వాడ మండలం పుల్సోనిపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన దివ్యాంగుడు కృష్ణయ్య  ఉపాధి హామీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఏడు వారాలకు సంబంధించిన కూలి డబ్బులు రావాల్సి ఉండగా శుక్రవారం సర్పంచ్​ కోస్గి శ్రీనివాసులును అడిగాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాట మాటా పెరిగింది.

ఈ క్రమంలో సర్పంచ్ శ్రీనివాసులు ​దివ్యాంగుడైన కృష్ణయ్యను నానా బూతులు తిట్టాడు. అక్కడే ఉన్న దివ్యాంగుడి కుటుంబసభ్యులను కూడా నోటికొచ్చినట్లు మాట్లాడాడు. నన్నే ఎదిరించి మాట్లాడతావా అంటూ కాలితో తన్నాడు. మండలానికి చెందిన ఆఫీసర్లను నోటి కొచ్చినట్లు తిట్టాడు. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను సెల్​ఫోన్​లో వీడియో తీసి వైరల్​చేశారు. ఘటనపై బాధితుడు హన్వాడ పోలీసులకు కంప్లయింట్​చేయడంతో కేసు నమోదు చేశారు. దాడి చేసిన సర్పంచ్​ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

స్పందించిన కలెక్టర్​

మహబూబ్​నగర్ కలెక్టరేట్​ : కాగా ఈ విషయం గురించి తెలుసుకున్న కలెక్టర్​ ఎస్​ వెంకట్​రావు సర్పంచ్ శ్రీనివాసులును  సస్పెండ్ చేశారు.  పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం, వికలాంగుడని కూడా చూడకుండా క్రూరంగా ప్రవర్తించడంతో అతడిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపాల్సిందిగా ఆర్డీఈఓ అనిల్ కుమార్ ను ఆయన ఆదేశించారు.