నెట్వర్క్, వెలుగు : మాజీ ప్రధానమంత్రి, ఆధునిక భారత నిర్మాణ శిల్పి రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని గురువారం ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో నిర్వహించారు. ఆయన విగ్రహాలకు, ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మక్తల్లో పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ దేశంలో సమాచార సాంకేతిక విప్లవానికి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి రాజీవ్ గాంధీ వేసిన పునాదులు చిరస్మరణీయమని కొనియాడారు. సూర్యాపేటలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, హుజూర్ నగర్లో మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ రాజీవ్ గాంధీ త్యాగాలను స్మరించుకున్నారు.
వనపర్తిలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి నివాళులర్పించారు. జోగిపేటలో మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, నల్గొండలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడుతూ, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
