సర్పంచ్​ల చుట్టూ పోలీసులు

సర్పంచ్​ల చుట్టూ పోలీసులు
  • సీఎం పర్యటన సమయంలో జడ్చర్లలో భారీ బందోబస్తు
  • కాన్వాయ్​ని సర్పంచ్​లు అడ్డుకోవచ్చన్న ఇంటెలిజెన్స్​
  • ముందస్తుగా మీటింగ్​ ప్రాంతంపై నిఘా పెట్టిన పోలీసులు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచ్​లు.. రాస్తారోకో
  • సీఎం కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు.. ఆందోళన
  • జాయింట్​ చెక్​ పవర్​ రద్దు చేయాలని డిమాండ్​

జడ్చర్ల, వెలుగు: సీఎం పర్యటన నేపథ్యంలో మహబూబ్​నగర్​ జిల్లా పోలీసుల తీరు ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎక్కడ సీఎం కాన్వాయ్​కు సర్పంచ్​లు అడ్డుతగులుతారోనని ముందుస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్పంచ్​ల మీటింగ్​ ప్రాంతాన్ని  చుట్టుముట్టారు. సీఎం పర్యటన ముగిసేదాకా వారిని బయటకు రానివ్వకుండా చర్యలు తీసుకున్నారు. సర్పంచ్​లకు, ఉప సర్పంచ్​లకు కలిపి జాయింట్​ చెక్​ పవర్​ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కొన్నాళ్లుగా సర్పంచ్​లు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భవిష్యత్​ కార్యక్రమాలపై చర్చించేందుకు శుక్రవారం జడ్చర్లలోని ప్రేమ్​రంగ గార్డెన్స్​ ఫంక్షన్​ హాల్​లో జిల్లా సర్పంచ్​లు సమావేశమయ్యారు. ఇదే సమయంలో వనపర్తి జిల్లా కేంద్రంలో మంత్రి నిరంజన్​రెడ్డిని పరామర్శించేందుకు సీఎం కేసీఆర్​ వెళ్లారు. ఆయన తిరుగు ప్రయాణంలో సర్పంచ్​ల సంఘం అడ్డుకునే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్​సూచనల మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రేమ్​రంగ గార్డెన్స్​ ఫంక్షన్​ హాల్​ వద్ద ఉదయం నుంచే భారీగా మోహరించారు. సర్పంచ్​లను బయటకు రాకుండా గేటు వద్దే నిలువరించారు. దీనిపై సర్పంచ్​లు మండిపడ్డారు. సీఎం కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం కాన్వాయ్​ వెళ్లిన తర్వాత పోలీసులు గేటును ఓపెన్​ చేయడంతో సర్పంచ్​లు ర్యాలీగా జడ్చర్ల సిగ్నల్​గడ్డపైకి చేరుకున్నారు. అక్కడ రాస్తారోకోకు దిగారు. దీంతో  ట్రాఫిక్​ స్తంభించింది. అనంతరం హైదరాబాద్–​-కర్నూలు జాతీయ రహదారి వైపు సర్పంచ్​లు ర్యాలీగా బయలుదేరగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అటు తర్వాత వ్యక్తిగత పూచికత్తుపై  విడుదల చేశారు.

జాయింట్​ చెక్​ పవర్​ రద్దు చేయాల్సిందే

ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశమైన సర్పంచ్​లు భవిష్యత్​ కార్యక్రమాలపై చర్చించారు. రాష్ట్రంలో సర్పంచ్, ఉప సర్పంచ్​కు నిధుల వినియోగంలో జాయింట్​ చెక్​ పవర్​ను కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు రద్దు చేయాల్సిందేనని డిమాండ్​ చేశారు. జాయింట్​ చెక్​ పవర్​ కల్పించడం వల్ల గ్రామాల్లో రాజకీయ గొడవలు వస్తాయని, దీని ప్రభావం గ్రామాల అభివృద్ధిపై పడుతుందని మహబూబ్​నగర్​ జిల్లా సర్పంచ్​ల సంఘం అధ్యక్షుడు ప్రణీల్​ చందర్​ అన్నారు. గతంలో ఎన్నడూ  లేని విధంగా ఇలా జాయింట్​ చెక్​ పవర్​ కల్పిస్తూ ఆదేశాలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా పరిధిలోని అనేక గ్రామాల సర్పంచ్​లు, పలువురు మద్దతు దారులు పాల్గొన్నారు.