శశికళకు చుక్కెదురు.. ముందస్తు విడుదల అసాధ్యం!

శశికళకు చుక్కెదురు.. ముందస్తు విడుదల అసాధ్యం!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత సన్నిహితురాలు శశికళ ముందస్తుగా విడుదలకావడం కలగానే అనిపిస్తోంది. శశికళ కోర్టు ఆదేశాలు, జైలు నిబంధనల ప్రకారమే విడుదల అవుతుందని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అక్రమాస్తుల కేసులో శశికళ ప్రస్తుతం బెంగళూరు పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆమె ఫిబ్రవరి 15, 2017న కర్ణాటక కోర్టుకు లొంగిపోయింది. అప్పటినుంచి ఆమె శిక్ష అనుభవిస్తోంది. తీర్పు ప్రకారం ఆమె వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల కావాల్సి వుంది. శశికళ తన శిక్ష కాలంలో ఆమె భర్త మృతి చెందినప్పుడు ఒక్కసారి మాత్రమే పెరోలుపై విడుదలయ్యారు. ప్రభుత్వ సెలవులు, పెరోలు కూడా కలుపుకుంటే ఆమె 129 రోజులకు ముందుగా విడుదలయ్యే అవకాశం ఉంది. సత్ప్రవర్తన కారణంగా ఆమెను జనవరి 27న విడుదల చేస్తామని కర్ణాటక జైళ్లశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. అంతేకాకుండా కోర్టు విధించిన అపరాధపు సొమ్ము రూ.10.10 కోట్లను కూడా చెల్లించడంతో ఆమె ఏ క్షణంలోనైనా విడుదలవుతారని ఆమె తరపు న్యాయవాది రాజా సెంధూర్‌పాండ్యన్‌ అన్నారు. దాంతో శశికళ ముందస్తు విడుదల కోరుతూ ఆయన గురువారం కర్ణాటక జైళ్ల శాఖ అధికారులకు వినతిపత్రం కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలో కర్నాటక హోంశాఖ మంత్రి బసవరాజ్‌ బొమ్మై శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. శశికళ ముందస్తు విడుదల అసాధ్యమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శశికళ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దాంతో శశికళ త్వరలో విడుదలవుతుందని ఆశలు పెట్టుకున్న అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం నేతలు, కార్యకర్తలు, ఆమె బంధువులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. హోంమంత్రి మాటల ప్రకారం.. శశికళ వచ్చే ఏడాది జనవరి 27న మాత్రమే విడుదలవుతారని తెలుస్తోంది.

For More News..

ప్రముఖ కవి, జర్నలిస్ట్ దేవీప్రియ మృతి

దుబ్బాక పాయే.. జీహెచ్ఎంసీ వచ్చే.. అయినా పీఆర్సీ రాకపాయే

ఫోన్ వాడొద్దన్నందుకు.. ఉరి వేసుకుంది