
జయశంకర్ భూపాలపల్లి: మహిళలకు భరోసా ఇచ్చే కేంద్రమే సఖీ వన్ స్టాప్ సెంటర్ అని అన్నారు రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్. మంగళవారం భూపాలపల్లిలో సఖీ వన్ స్టాప్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి మీడియాతో మాట్లాడారు… సఖీ అంటే నేస్తం అని, మన దోస్త్ అని.. సఖీ నేనున్నాననే భరోసాను ఇస్తుందని అన్నారు. బాధిత మహిళలకు అన్ని రకాల పరిష్కారాలను ఇచ్చే విధంగా సఖీ పని చేస్తుందని తెలిపారు. దీని ద్వారా మహిళలు తమ కష్టాలు చెప్పుకోడానికి అందరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించేదిశలో అన్ని రాష్ట్రాలకన్నా ముందుందని తెలిపారు. మహిళా పోలీస్ ఆఫీసర్ ను సఖీ కేంద్రానికి కేటాయించాలని సీఎం కేసీఆర్ ను కోరుతామని చెప్పారు.
ఫ్రెండ్లి పోలీస్ అంటే లంగా, దొంగ పనులు చేసేవారిని పక్కన కూర్చోబెట్టుకోవడం కాదని అన్నారు మంత్రి. అలాంటి వారి పట్ల కఠినంగా ఉంటూ, బాధితుల పట్ల ఫ్రెండ్లిగా ఉండాలని కోరుతున్నానని చెప్పారు. దేశ వ్యాప్తంగా సఖీ కేంద్రాలున్నా రాష్ట్రంలో నిర్వహించే సఖీ కేంద్రాలు అన్ని విధాలా సమృద్ధిగా ఉండాలని వాటికి అవసరమైనన్ని నిధులు కేటాయిస్తున్నాట్లు చెప్పారు. బాల్య వివాహాలు జరగకుండా చూడాలని, 18 ఏళ్ళు నిండిన వారికే వివాహాలు జరిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ హర్షిణి, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ వెంకట రాణి, వికలాంగుల కార్పొరేషన్ తొలి మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, కలెక్టర్ అబ్దుల్ అజీమ్, ఏ.ఎస్పీ శ్రీనివాస్, సఖీ సెంటర్స్ ఇంచార్జి శ్రీమతి గిరిజ, కె ఎస్ ఆర్ ట్రస్ట్ అధ్యక్షులు రామ్ నర్సిహ్మా రెడ్డి, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.