
- బీఆర్ఎస్ను బలహీనపర్చేందుకే అరెస్టు: సత్యవతి రాథోడ్
- కేసీఆర్, కేజ్రీవాల్ను ఇబ్బంది పెట్టడమే మోదీ లక్ష్యం
- పాలసీలు మార్చినంత మాత్రానా అవినీతి జరిగినట్టా?
- అట్లయితే బొగ్గు, విద్యుత్ పాలసీలు మార్చిన ప్రధాని మోదీని అరెస్టు చేయాల్నా? అని ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవిత.. కడిగిన ముత్యంలా బయటకు వస్తారని, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ కేసులో నిజం నిలకడ మీద తెలుస్తుందని ఆమె చెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో సత్యవతి మాట్లాడారు.
తెలంగాణలో కేసీఆర్ను, ఢిల్లీలో కేజ్రీవాల్ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పాలన సాగుతున్నదని ఆమె మండిపడ్డారు. ‘‘ఈ కేసులో కవిత నిందితురాలు కాదు.. కేవలం బాధితురాలే. బీఆర్ఎస్ను బలహీనపర్చాలన్న కుట్రలో భాగంగానే ఆమెను అరెస్టు చేశారు. ప్రతిపక్షాలను వేధించడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. తమ మాట వినని పార్టీల నేతలను అరెస్టు చేయిస్తున్నది. ఆప్ ను చీల్చి తమ పార్టీలోకి వస్తే ముఖ్యమంత్రిని చేస్తామని మనీశ్ సిసోడియాకు బీజేపీ ఆఫర్ ఇచ్చింది.
అయితే ఆయన మాట వినలేదని అరెస్టు చేయించింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కవితను అరెస్టు చేయించింది. ప్రధాని మోదీ, ఈడీ ఒకేరోజు తెలంగాణకు రావడమే ఇందుకు నిదర్శనం. లిక్కర్ కేసులో కవిత నిజంగా దోషి అయితే.. ఈడీ అధికారులు దొడ్డిదారిన సెర్చ్ వారెంట్లతో రావాల్సిన అవసరం ఏముంది? అరెస్టు వారెంట్తో రావాల్సింది” అని అన్నారు.
బీజేపీ చేతుల్లో సీబీఐ, ఈడీ
ప్రభుత్వాలు పాలసీలు మార్చినంత మాత్రానా అవినీతికి పాల్పడినట్టా? అని సత్యవతి ప్రశ్నించారు. ‘‘ఢిల్లీ ప్రభుత్వం మద్యం పాలసీని మార్చి లబ్ధి పొందిందని బీజేపీ అంటున్నది. దేశంలోని అనేక ప్రభుత్వాలు పాలసీలను మార్చాయి. పాలసీలు మార్చినంత మాత్రానా అవినీతికి పాల్పడినట్టా? కేంద్ర ప్రభుత్వం కూడా అనేక పాలసీలు మార్చింది. బొగ్గు, విద్యుత్ పాలసీల్లో మార్పులు చేసింది.
అట్లయితే వీటి ద్వారా ప్రధానమంత్రి మోదీ కూడా అవినీతికి పాల్పడ్డారా? ఈ వ్యవహారంలో ఆయనను అరెస్టు చేయాల్నా?” అని ప్రశ్నించారు. ‘‘అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు బీజేపీలోకి వెళ్లగానే వారిపై అన్ని కేసులు మాఫీ అవుతున్నాయి. ఇలా చేయడం వల్ల దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ మీద ప్రజలకు నమ్మకం లేకుండాపోతున్నది. ఇది భవిష్యత్ తరాలకు మంచిది కాదు. ప్రస్తుతం సీబీఐ, ఈడీ అధికారులు యాక్టర్లుగా మారారు. బీజేపీ, మోదీ ఈ వ్యవహారానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు” అని విమర్శించారు.