యూపీ: ఈ ఏడాది మార్చిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపి మాజీ ఎంపీ సావిత్రిబాయి ఫూలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదని, అందువల్లే రాజీనామా చేస్తున్నానని మీడియాకి తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ కి పెద్ద తేడా ఏం లేదని, సమాజంలో మార్పు కోసం త్వరలో సొంత పార్టీ పెట్టబోతున్నానని ఆమె ప్రకటించారు.
ఎన్నికల సమయంలో ఉపయోగిస్తున్న ఈవీఎం ల వాడకానికి తాను వ్యతిరేకమని సావిత్రి చెప్పారు. దాని వల్ల రాజ్యాంగ ఉల్లంఘన జరుగతుందని అందుకు నిరసన తెలపాలని ప్రియాంక గాంధీకి విజ్ఞప్తి చేసినప్పుడు, అసలు ఈవీఎం ఆలోచనను తీసుకువచ్చినది తమ ప్రభుత్వమేనని, దానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయలేనని ఆమె అన్నారని చెప్పారు ఫూలే. ప్రస్తుతం రాజ్యాంగం మరియు రిజర్వేషన్లు ప్రమాదంలో ఉన్నాయి. ఈవీఎం మెషిన్ల వాడకానికి నేను ఎప్పుడూ వ్యతిరేకమే. బ్యాలెట్ బాక్సుల ద్వారా దాన్ని భర్తీ చేయాలని నేను నమ్ముతున్నాను అని ఫూలే తెలిపారు.
తన రాజీనామా లేఖను చూపిస్తూ, తన కొత్త పార్టీ ఎజెండా “బహుజన్ హితాయే, బహుజన్ సుఖాయే” అని ఆమె చెప్పారు. ఆర్ఎస్ఎస్ సమాజంలో అసమానతలను సృష్టించిందని సావిత్రిబాయి ఫూలే ఆరోపించారు.

