
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) నికర లాభం డిసెంబర్ క్వార్టర్లో 35 శాతం (ఇయర్ ఆన్ ఇయర్) తగ్గింది. బ్యాంక్కు 2022 డిసెంబర్ క్వార్టర్లో రూ. 14,205 కోట్ల నికర లాభం రాగా, తాజా డిసెంబర్ క్వార్టర్ (క్యూ3) లో రూ.9,164 కోట్లు (స్టాండ్ ఎలోన్) వచ్చాయి. రెవెన్యూ మాత్రం రూ.98,084 కోట్ల నుంచి రూ.1,18,193 కోట్లకు ఎగసింది. వడ్డీ ఆదాయం రూ.86,616 కోట్ల నుంచి రూ.1,06,734 కోట్లకు చేరుకుంది. ఎస్బీఐ మొండిబాకీలు తగ్గాయి. అప్పుల్లో బ్యాంక్ గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్పీఏల) రేషియో డిసెంబర్ క్వార్టర్లో 2.42 శాతానికి దిగొచ్చింది. అంతకు ముందు ఏడాది డిసెంబర్ క్వార్టర్లో ఈ నెంబర్ 3.14 శాతంగా ఉంది. అలానే నెట్ ఎన్పీఏల రేషియో 0.77 శాతం నుంచి 0.64 శాతానికి మెరుగుపడింది. కన్సాలిడేషన్ బేసిస్లో చూస్తే క్యూ3 లో ఎస్బీఐకి రూ. 11,064 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముందు ఏడాది డిసెంబర్ క్వార్టర్లో వచ్చిన రూ.15,477 కోట్లతో పోలిస్తే ఇది 29 శాతం తక్కువ. కానీ, మొత్తం ఆదాయం మాత్రం రూ.1,27,219 కోట్ల నుంచి రూ.1,53,072 కోట్లకు ఎగసింది. ఎస్బీఐ పెన్షన్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్లోని ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్కు చెందిన 20 శాతం వాటాను ఎస్బీఐ క్యూ3 లో కొనుగోలు చేసింది. దీంతో ఎస్బీఐ ఫండ్స్లో బ్యాంక్ వాటా 80 శాతానికి చేరుకుంది. ఎస్బీఐ షేర్లు శుక్రవారం రూ.648 దగ్గర ఫ్లాట్గా ముగిశాయి.