న్యూఢిల్లీ: యోనో ప్లాట్ఫామ్ ద్వారా గోల్డ్ లోన్ తీసుకునే కస్టమర్లకు వడ్డీలో రాయితీని స్టేట్ బ్యాంక్ ప్రకటించింది. గోల్డ్ నగలు, కాయిన్స్ వంటి వాటిని తనఖాగా పెట్టి గోల్డ్లోన్లను తీసుకుంటారు. యోనో ద్వారా అప్లయ్ చేసుకున్న కస్టమర్లకు గోల్డ్ లోన్ను 7.5 శాతం వడ్డీ రేటు వద్ద ఇస్తారు. ఇది ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు కంటే 0.75 శాతం తక్కువ. ఈ ఆఫర్ ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రూ. 20 వేల నుంచి రూ. 50 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. లోన్ టెనూర్ 36 నెలలు. ఫోర్క్లోజర్ ఫీజు (డేట్ కాకముందే లోన్ తీర్చడం) ను, ప్రీ పేమెంట్ పెనాల్టీని ఎస్బీఐ రద్దు చేసింది.
యోన్ ద్వారా లోన్ ఇలా తీసుకోవచ్చు..
- యోనో యాప్లో లాగిన్ అవ్వాలి. హోమ్ పేజిలో మెను బార్ను క్లిక్ చేయాలి.
- లోన్స్ సెక్షన్ను ఓపెన్ చేయాలి. డ్రాప్ డౌన్లో కనిపించే ‘గోల్డ్ లోన్’ ను క్లిక్ చేయాలి. తర్వాత లోన్కు అప్లయ్ చేయాలి.
- తనఖాగా పెట్టాలనుకునే నగల డిటైల్స్ను ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వాటి క్వాంటిటీ, ఎన్ని క్యారెట్లు, నెట్ వెయిట్ ఎంత, ఏ టైప్ నగ వంటి విషయాలను ఇవ్వాల్సి ఉంటుంది.
- దీంతో పాటు కస్టమర్ డిటైల్స్ను కూడా ఇవ్వాలి. కస్టమర్ వృత్తి, నెలవారి ఇన్కమ్ వంటి డిటైల్స్ను ఇవ్వాలి. తర్వాత అప్లికేషన్ను సబ్మిట్ చేయాలి.
- తనఖా కోసం పక్కన పెట్టిన గోల్డ్ను బ్యాంక్ బ్రాంచుకు తీసుకువెళ్లాలి. రెండు ఫోటోలు, కేవైసీ డాక్యుమెంట్లను బ్యాంక్కు ఇవ్వాల్సి ఉంటుంది.
- లోన్ డాక్యుమెంట్లపై సంతకాలు పెడితే లోన్ అమౌంట్ ఇస్తారు.