- ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
నిజామాబాద్, వెలుగు : దళిత, గిరిజన వర్గాల అభివృద్ధి కోసం కేటాయించిన సబ్ప్లాన్ నిధులను పూర్తిగా వినియోగించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ప్రభుత్వాన్ని కోరారు. శనివారం కలెక్టరేట్లో ఆయన రివ్యూ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ యూత్కు స్వయం ఉపాధి స్కీములు మంజూరు చేయడానికి కొర్రీలు పెట్టొద్దన్నారు. కులసంఘాల నేతల సమక్షంలో అట్రాసిటీ కేసుల పురోగతిని సమీక్షించారు.
కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య తదితరులు ఉన్నారు. అంతకు ముందు నందిపేట మండలం కేంద్రంలోని ప్రసిద్ధ కేదారీశ్వర ఆశ్రమాన్ని విజిట్ చేసి ఆశ్రమ స్థాపకుడు మంగి రాములు మహరాజ్ ఆశీర్వాదాలు పొందారు.
కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి పరామర్శ
రౌడీ షీటర్ సయ్యద్ రియాజ్ చేతిలో హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్కుమార్ కుటుంబీకులను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం పరామర్శించారు. కమిషన్ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
దళిత మహిళకు పరిహారం అందేలా చూడాలి
కామారెడ్డిటౌన్ : ఇటీవల పాల్వంచ మండలం ఫరీద్పేటలో లైంగికిదాడికి గురైన దళిత మహిళకు తక్షణమే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్కు సూచించారు. శనివారం కామారెడ్డి ఆర్అండ్బీ గెస్టు హౌజ్లో బాధితురాలిని పరామర్శించి మాట్లాడారు.
బీహార్కు చెందిన నిందితుడిని పట్టుకోవటంలో చొరవ తీసుకున్న ఏఎస్పీ చైతన్యారెడ్డి, కామారెడ్డి రూరల్ సీఐ రామన్ను ఆయన సన్మానించారు. ఆయన వెంట అంబేడ్కర్, ఎస్సీ సంఘాల ప్రతినిధులు బట్టెంకి బాల్రాజు, తమ్మడి స్వామి, రాజు, బట్ట వెంకటరాములు, కొత్తపల్లి మల్లయ్య , చిట్యాల సాయిలు ఉన్నారు.
