
- మంత్రి శ్రీధర్బాబుకు మాల సంఘాల జేఏసీ వినతి
ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణలో మాలలకు అన్యాయం జరుగుతుందని, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించకుండా వర్గీకరణ చేయడం సరికాదని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ అన్నారు. ఈ అంశంపై సీఎం రేవంత్రెడ్డి దృష్టి సారించాలని కోరారు. ఈ మేరకు సోమవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మాలలకు ఎలా అన్యాయం జరుగుతుందో మంత్రికి వివరించామని తెలిపారు. అన్ని రాజకీయ పక్షాలను కలుస్తూ వినతి పత్రాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. జేఏసీ ప్రతినిధులు బేర బాలకిషన్, చెరుకు రామచందర్,ఎం.నరసింహయ్య, మాదాసు రాహుల్ రావు, డాక్టర్ వీరస్వామి, నర్సింగ్ రావు, ప్రణయ్ తదితరులున్నారు.