త్వరలోనే ఆర్మీ రిక్రూట్‌మెంట్ షెడ్యూల్‌

త్వరలోనే ఆర్మీ రిక్రూట్‌మెంట్ షెడ్యూల్‌

ఆర్మీ ప‌రీక్షకు సంసిద్ధమవుతోన్న యువ‌త‌కు వ‌యోప‌రిమితిని ఒక‌సారి పెంచే అవ‌కాశాన్ని  కేంద్రం క‌ల్పించిందని, ఈ నేపథ్యంలోనే రిక్రూట్ మెంట్ వయసును 23ఏళ్లకు పెంచామని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు. ఈ నిర్ణయం వ‌ల్ల దేశంలోని యువ‌త‌కు త‌మ దేశ‌భ‌క్తిని చాటుకునే అవకాశం దొరుకుతుంద‌న్న ఆయన..  కొవిడ్ స‌మ‌యంలోనూ తీవ్రంగా క‌ష్టప‌డ్డ యువ‌త‌కు ఇప్పుడు మంచి అవ‌కాశం ల‌భిస్తుంద‌ని చెప్పారు.  దేశంలో అగ్నిపథ్ ఇష్యూ తీవ్ర ఆందోళనలకు దారి తీస్తున్న ఈ సమయంలో మనోజ్ పాండే పలు కీలక వ్యాఖ్యలు చేశారు.  కొవిడ్ నిబంధనల కారణంగా గత రెండేళ్లుగా ఈ ప్రక్రియను పూర్తి చేయలేకపోయామని అన్నారు. రిక్రూట్‌మెంట్ ర్యాలీల్లో చేరేందుకు సిద్ధమవుతున్న యువకులకు ఈ నిర్ణయం మంచి అవకాశం కల్పిస్తుందన్న మనోజ్ పాండే... రిక్రూట్‌మెంట్ ప్రక్రియ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. మరోవైపు అగ్నివీర్స్ మొదటి ట్రైనింగ్ ఈ ఏడాది డిసెంబర్ నుంచి మొదలవుతుందని మనోజ్ పాండే అన్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారు..2023 జూన్ లోగా సర్వీస్ లో చేరతారని చెప్పారు. భారత సైన్యంలో అగ్నివీరులుగా చేరేందుకు యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనోజ్ పాండే పిలుపునిచ్చారు.

ఇకపోతే తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనూ అభ్యర్థులు తీవ్ర అలజడి సృష్టించారు. 4 రైళ్లకు నిప్పు పెట్టడంతో అక్కడి వాతావరణం రణరంగాన్ని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఛాతిలో బుల్లెట్ తాకి ఒకరు మృతి చెందగా.. మరో 8 మందికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.