- ఏర్పాటు చేసిన నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ
- బేస్ క్యాంప్ 1, 2లు సహా మొత్తం ఐదు ఏర్పాటు
కాఠ్మండు: ఎవరెస్ట్.. చాలా మంది పర్వతారోహకులకు అదో గమ్యం. అది ఎక్కేస్తే చాలనుకునే వాళ్లు చాలా మందే ఉంటారు. కానీ, కొద్ది రోజుల కింద మంచు కొండపై పరిస్థితేంటో తెలిసిందే. ట్రాఫిక్ పెరిగి ఇండియన్లు సహా పదుల సంఖ్యలో అక్కడ ఇరుక్కుపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు. దాంతో పాటు ఎటూ తెలియని వాతావరణ పరిస్థితులూ వారి ప్రాణాలను బలిగొన్నాయి. ఇకపై అలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఎవరెస్ట్ అంచుపైన ఓ ఆటోమేటెడ్ వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ (ఎన్జీఎస్). దాంతో పాటు మరో నాలుగు కేంద్రాలనూ పెట్టింది. రీసెర్చర్లు, క్లైంబర్లు, ప్రజలకు ఎవరెస్ట్ శిఖరంపైన వాతావరణ పరిస్థితులేంటో తెలియజేసేందుకు ప్రపంచంలోనే ఎత్తైన వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎన్జీఎస్గురువారం ప్రకటించింది.
‘‘వివిధ విభాగాలకు చెందిన సైంటిస్టులు, వాతావరణ నిపుణులు ఎవరెస్ట్పై ప్రపంచంలోనే ఎత్తైన వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో ఎవరెస్ట్కు బాల్కనీగా పిలిచే ప్రాంతంలో 8,430 మీటర్ల ఎత్తులో ఒక కేంద్రాన్ని పెట్టాం. రెండోది 7,945 మీటర్ల ఎత్తులో దక్షిణాన నెలకొల్పాం” అని ఎన్జీఎస్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ డైరెక్టర్ ఫే జెంక్స్ చెప్పారు. మరో మూడింటిని ఫోర్ట్సే (3,810 మీటర్లు), బేస్ క్యాంప్ (5,315 మీటర్లు), బేస్క్యాంప్2 (6,464 మీటర్లు) వద్ద ఏర్పాటు చేసినట్టు వివరించారు. అన్ని కేంద్రాలు ఆయా ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతలు, తేమ, పీడనం, గాలి వేగం, గాలి దిశ తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాయని చెప్పారు. రోలెక్స్ పర్పెచువల్ ఎక్స్ట్రీమ్ ఎక్స్పెడిషన్ టు ఎవరెస్ట్ సహకారంతో వీటిని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వీటి వల్ల ఆ ప్రాంతంలోని వందల కోట్ల మందికి మేలు కలుగుతుందన్నారు.
ఏప్రిల్, జూన్ మధ్య నేట్జియో సొసైటీ, త్రిభువన్ యూనివర్సిటీ, రోలెక్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సైంటిస్టులు, క్లైంబర్లు ఎవరెస్ట్పై సైంటిఫిక్ ప్రయోగాలు చేపట్టారన్నారు. చరిత్రలో చేసిన ఒకే ఒక్క సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ ఇదేనని భావిస్తున్నారు. అంతేగాకుండా ఆ టీం ఎత్తైన ప్రాంతంలోని (8,020 మీటర్లు) ఐస్ కోర్ను తీసుకొచ్చారు. అది కూడా మొదటి సారేనని భావిస్తున్నారు