- కర్నాటకలో కూడా చేయించాలని సీఎంకు మంత్రుల రిక్వెస్ట్
న్యూఢిల్లీ/బెంగళూరు: మహారాష్ట్ర, తమిళనాడులో టీవీ జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ రావడంతో మిగతా రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. జర్నలిస్టులకు టెస్టులు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఢిల్లీ పరిధిలోని జర్నలిస్టులు అందరికీ టెస్టులు చేయిస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. జర్నలిస్టులందరికీ టెస్టులు చేయించాలని కోరుతూ ఒక వ్యక్తి ట్విట్టర్లో రిక్వెస్ట్ చేయగా.. కేజ్రీవాల్ దానికి రిప్లై ఇచ్చారు. “ కచ్చితంగా.. టెస్టులు చేయిస్తాం” అని ట్వీట్ చేశారు. మరోవైపు కర్నాటకలోని జర్నలిస్టులందరికీ స్క్రీనింగ్ టెస్ట్ చేయించాలని ఆ రాష్ట్ర సీఎం బీఎస్ యడియూరప్పను మంత్రులు కోరారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎస్ సురేశ్ కుమార్ సీఎంకు లెటర్ రాశారు. “ నిత్యం ప్రజల్లో ఉండే జర్నలిస్టులకు కూడా కచ్చితంగా టెస్టులు చేయించాలి. రాష్ట్రంలోని జర్నలిస్టులకు స్క్రీనింగ్ చేయాలని మెడికల్ డిపార్ట్మెంట్కు ఆదేశాలు ఇవ్వండి” అని మంత్రి లెటర్లో పేర్కొన్నారు. ముంబైలో 171 మంది జర్నలిస్టులకు టెస్టులు నిర్వహించగా.. వారిలో దాదాపు 53 మందికి పాజిటివ్ వచ్చింది. అంతే కాకుండా తమిళనాడులో కూడా టీవీ జర్నలిస్టులు కూడా కరోనా బారినపడ్డారు.