
నాలుగింట మూడు వంతుల భూమి నీటి తో కప్పబడి ఉన్నది. కాబట్టి భూమి నీలి రంగులో కనబడుతుంది. భూమిపై ఉన్న నీటిలో దాదాపు 97% సముద్రపు నీరు, కేవలం 3% మాత్రమే మంచినీరుగా ఉన్నది. ఆ 3%లో ఎక్కువ భాగం (68.7%) హిమానీనదాలు, మంచు కప్పులలో నిక్షిప్తమై ఉంటుంది. అంటే భూమి అత్యధిక భాగము మహాసముద్రాలతో ఆవరించబడి ఉన్నది. కానీ ఈ సముద్రాలు పర్యావరణ మార్పులకు గురి అవుతున్నాయి.
ప్లైమౌత్ విశ్వవిద్యాలయం (ఇంగ్లాండ్) ఉపగ్రహ డేటా ద్వారా సేకరించిన పరిశోధన సమాచారం ప్రముఖ గ్లోబల్ చేంజ్ బయాలజీ జర్నల్లో ప్రచురితమైనది. ఈ పరిశోధన ప్రకారం 2003–22 మధ్య కాలంలో ప్రపంచ మహాసముద్రాలలో 21% చీకటిగా మారాయి.
అంటే సముద్రం చీకటిగా మారుతోంది. ఈ ప్రభావం 75 మిలియన్ చదరపు కిలోమీటర్ల మేర (30 మిలియన్ చదరపు మైళ్ళు) సముద్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది యూరప్, ఆఫ్రికా, చైనా, ఉత్తర అమెరికాల భూభాగానికి సమానం. సముద్రంలో 9% ఫోటోజోన్లు 50 మీటర్లకు పైగా కుంచించుకుపోయాయి, తీవ్రమైన సందర్భాల్లో ఈ తగ్గింపు 100 మీటర్లను దాటింది.
సముద్రం చీకటిగా మారుతోంది
సముద్రం చీకటిబడటం అంటే నీటి స్పష్టత తగ్గడం(అంటే నీరు ట్రాన్స్పెరెంట్గా ఉండక మసకబారి కనబడటము). నీటి స్పష్టత తగ్గడం వలన సూర్యరశ్మి సముద్రం లోపలికి ఎక్కువ దూరం చొచ్చుకొని పోలేదు. ఈ మార్పు సూర్యరశ్మి చొచ్చుకుపోయే సముద్రంపై పొర అయిన ఫోటోజోన్ను ప్రభావితం చేస్తుంది. ఇక్కడ దాదాపు 90% సముద్ర జీవులు నివసిస్తాయి. ఇది సాధారణంగా ఉపరితలం నుండి 200 మీటర్లు (650 అడుగులు) లోతు వరకు విస్తరించి ఉంటుంది.
ఫోటోజోన్ లో ఉండే సముద్రపు సూక్ష్మ శైవలాలను ఫైటోప్లాంక్టన్ లు అని పిలుస్తారు. ఫైటోప్లాంక్టన్ లు భూమిపై నివసించే మొక్కల వలె సూర్యకాంతిని శోషించుకొని కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేస్తాయి. ఫైటోప్లాంక్టన్ లు ప్రాథమిక ఉత్పత్తిదారులు. అంటే ఫైటోప్లాంక్టన్లు సముద్ర ఆహార గొలుసు, ఆహార వలయానికి పునాదిని ఏర్పరుస్తాయి.
ఫైటోప్లాంక్టన్లు ద్వారానే ఆహారగొలుసు ద్వారా సముద్ర జీవులు ఆహారాన్ని పొందుతాయి. సముద్ర జలాలలోకి సూర్యకాంతి చొచ్చుకొని పోకపోతే, ఫైటోప్లాంక్టన్ లలో కిరణజన్య సంయోగక్రియ జరగదు కనుక ఆహార ఉత్పత్తి జరగక ఆహారగొలుసు ద్వారా సముద్ర జీవులకు ఆహారము లభించక సముద్ర జీవులు నశిస్తాయి అందువలన పర్యావరణానికి హాని కలుగుతుంది.
కుంచించుకుపోతున్న ఫోటోజోన్
కుచించుకుపోతున్న ఫోటోజోన్ సముద్ర జీవవైవిధ్యాన్ని, పర్యావరణ వ్యవస్థలను దెబ్బతీస్తుంది. ఇది వాతావరణాన్ని నియంత్రించే ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే సముద్ర సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ మార్పు ప్రపంచాన్ని మేల్కొలిపే పిలుపుగా పనిచేస్తుందని హెచ్చరిస్తున్నారు.
మన భవిష్యత్తు మహాసముద్రాలతో ఎంత దగ్గరగా ముడిపడి ఉంది. వ్యవసాయ ప్రవాహం ద్వారా పోషకాలు, అవక్షేపాలు సముద్ర జలాలలోకి వచ్చిచేరటం, వాతావరణ- ప్రేరిత మార్పుల వలన సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత లలో మార్పులు, వర్షపాతం, నేల కోత ద్వారా సేంద్రియ పదార్ధాల పరిమాణం సముద్ర జలాల్లో పెరగటం మొదలగునవి ఫోటోజోన్ కుంచించుకు పోవటానికి కారణాలు అయి ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ప్రభావితమవుతున్న జీవవైవిద్యం
సముద్ర జలాలు చీకటిగా మారటం వలన కాంతి- ఆధారిత జీవజాతులు సముద్రనీటి ఉపరితలానికి దగ్గరగా వచ్చి చేరుతాయి. దీనివల్ల ఆహారం, స్థలం కోసం సముద్ర జీవుల మధ్య పోటీ, ఒత్తిడి పెరుగుతుంది. సముద్ర జీవజాతులకు ఆహారం లభించదు. సముద్ర జీవుల వలసలకు అంతరాయం కలుగుతుంది . వాటి పునరుత్పత్తి పై ప్రభావం పడటం వలన సముద్ర జీవులు నశించి పోతాయి. ఇది జీవవైవిధ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా మొత్తం పర్యావరణ వ్యవస్థలను అస్థిరపరుస్తుంది.
మానవాళిపై ప్రభావం
సముద్రం చీకటిగా మారడం వలన మానవాళిపై తీవ్రమయిన ప్రభావాన్ని చూపుతుంది. సముద్రం చీకటిగా మారడం కేవలం సముద్ర సంక్షోభం కాదు, ఎందుకంటే మానవులు సముద్రాలతో ఎంతో సంబంధం కలిగి ఉన్నారు. కుంచించుకుపోతున్న ఫోటోజోన్ క్రింద వివరించిన వాటిని ప్రభావితం చేస్తుంది.
అవి 1. సముద్ర ఫైటోప్లాంక్టన్ భూమి యొక్క ఆక్సిజన్లో 50% కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. 2. అంతరాయం కలిగిన సముద్ర ఆహారగొలుసు ఆహార వలయం ప్రపంచ మత్స్య సంపదను ప్రభావితం చేస్తుంది. 3. మహాసముద్రాలు కార్బన్ డయాక్సైడ్, వేడిని గ్రహించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. సముద్ర జీవసంబంధ కార్యకలాపాలలో మార్పులు ఈ సామర్థ్యాన్ని తగ్గించటం వలన తీవ్రమైన వాతావరణ మార్పులు సంభవించవచ్చు.
సమతుల్యత దెబ్బతింటున్నది
సముద్రం భావించే దానికంటే ఎక్కువ సున్నితమైనది. సూర్యకాంతి, చంద్రకాంతి లభ్యతలో స్వల్ప తగ్గుదల కూడా సముద్ర పర్యావరణ వ్యవస్థల స్వభావాన్ని మార్చగలదు. ఫోటోజోన్లు కుంచించుకుపోయినప్పుడు సముద్ర జీవులు నిస్సార పొరల్లోకి నెట్టబడతాయి. ఇది వాటి ప్రవర్తనలు, మనుగడ రేట్లు, పర్యావరణ సమతుల్యతలను దబ్బతీస్తాయి. ఇది ఒక పరిశోధన అంచనాకాదు.
ఇది ఇప్పటికే కొనసాగుతున్న పరివర్తన, ప్రపంచం జాగ్రత్తలు తీసుకోవలసిన సమయం. మెరుగైన భూమి, సముద్ర నిర్వహణ, వ్యవసాయ ప్రవాహాలను, వాతావరణ మార్పు తగ్గించటం, స్థిరమైన సముద్ర పర్యవేక్షణల ద్వారా ఫోటో జోన్లు కుంచించుకు పోవటాన్ని నివారించ వచ్చు. సముద్రం చీకటిగా మారడం అనేది కేవలం శాస్త్రీయ పరిశీలన మాత్రమే కాదు.
భూమి పై గల వివిధ జీవావరణ వ్యవస్థలు ఒత్తిడిలో ఉన్నాయని తెలుసు కోవటానికి ఇది స్పష్టమైన సంకేతం. దీనిని నివారించటానికి తగు చర్యలు తీసుకోవాలి. మహాసముద్రాలు నీటి అడుగున జీవానికి నిలయంగా ఉండటమే కాకుండా భూమిపై గల జీవజాతులు కూడ సముద్రాలపై ఆధారపడి ఉన్నాయి. మహాసముద్రాలలో కాంతి మసకబారితే, దాని పరిణామాలు పర్యావరణ వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలు, రాబోయే తరాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
- డాక్టర్. శ్రీధరాల రాము ,ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్. హైదరాబాద్.-