వానాకాలం స్టార్ట్.. డెంగ్యూ డేంజర్ ! మొదలైన సీజనల్ జ్వరాలు

వానాకాలం స్టార్ట్.. డెంగ్యూ డేంజర్ ! మొదలైన సీజనల్ జ్వరాలు
  • పిల్లలు, వృద్ధుల్లో చాలా మందికి ఏదో ఒక వైరల్ ​ఫీవర్​
  • ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖాన్లకు వైరల్ ఫీవర్స్​తో క్యూ 
  • రాష్ట్రవ్యాప్తంగా 500 దాకా డెంగ్యూ  కేసులు
  • అలర్ట్​గా ఉండాలంటున్న డాక్టర్ల సూచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సీజనల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా ఏటా జులై, ఆగస్టులో ఎక్కువగా నమోదయ్యే డెంగ్యూ కేసులు ఈసారి ముందే వస్తుండటం ఆందోళనకరంగా మారింది. వానాకాలం ప్రారంభం కావడంతో పాటు వాతావరణంలో మార్పులు వస్తుండటంతో వైరల్ జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వైరల్ ఫీవర్లతో బాధితులు క్యూ కడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో ఈ 15 రోజుల్లోనే 500కు పైగా డెంగ్యూ  కేసులు నమోదైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇది సీజనల్ వ్యాధుల సమయం కావడంతో వైరల్ ఫీవర్, వైరల్ ఇన్ఫెక్షన్లు రావడం సాధారణం.

అయితే ఈసారి డెంగ్యూ  కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజులుగా ఆసుపత్రులకు వచ్చే వారిలో జ్వరం, ఒళ్ళు నొప్పులు, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. చాలామందికి సాధారణ వైరల్ ఫీవర్లు అవుతున్నా, కొందరిలో మాత్రం డెంగ్యూ  నిర్ధారణ అవుతోంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఈ జ్వరాల బారిన పడుతున్నారు. ఆసుపత్రుల్లో సాధారణ ఓపీ (ఔట్ పేషెంట్) విభాగాలతో పాటు, ఇన్‌‌పేషెంట్ వార్డుల్లో కూడా రోగుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. అయితే వానాకాలం మొదలైనప్పటికీ  వైద్యారోగ్య శాఖ ఇంకా ఇంటింటి జ్వర సర్వేను కూడా మొదలు పెట్టలేదు.

రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో, ముఖ్యంగా గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రభుత్వ ఆసుపత్రులకు జ్వరాలతో వచ్చే రోగుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌ల పరిస్థితీ అంతే ఉన్నది. ఓపీ 50 శాతం దాకా పెరిగినట్లు డాక్టర్లు చెబుతున్నారు. సీజనల్ వ్యాధుల ఎఫెక్ట్​తోనే ఈ సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. డెంగీ అనుమానిత లక్షణాలతో వచ్చే వారికి ప్రత్యేకంగా ప్లేట్‌లెట్ కౌంట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్లేట్‌లెట్లు తగ్గుతున్న అనేక కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు చాలా మంది ఏదో ఒక రకమైన వైరల్ ఫీవర్ బారిన పడుతున్నారు. ఉదయం దగ్గు, జలుబుతో మొదలై, సాయంత్రానికి తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులతో పరిస్థితి విషమిస్తోంది. దీంతో ఆసుపత్రుల్లో ఓపీ సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. 

డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ఈ సీజన్‌లో ప్రబలంగా ఉంటాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జ్వరం, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని సూచిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌, సూర్యాపేట, మేడ్చల్‌, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్‌, రంగారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, వరంగల్‌, వనపర్తి, మహబూబ్‌నగర్‌ వంటివి వైరల్ ఫీవర్లకు హైరిస్క్‌ జిల్లాలుగా ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.