- 148 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 19 పైసలు నష్టపోయిన రూపాయి
ముంబై: మెటల్ షేర్లలో కొనుగోళ్లు, సానుకూల అంతర్జాతీయ ట్రెండ్స్ వల్ల మార్కెట్లు వరుసగా రెండో రోజైన శుక్రవారమూ లాభపడ్డాయి. సెన్సెక్స్ 449.53 పాయింట్లు పెరిగి 85,267.66 వద్ద ముగిసింది. పగటిపూట ఇది 502.69 పాయింట్లు ఎగిసి 85,320.82 స్థాయికి చేరింది. నిఫ్టీ 148.40 పాయింట్లు దూసుకెళ్లి 26,046.95 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ సంస్థల్లో టాటా స్టీల్, ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, మారుతి, ఎయిర్టెల్ ప్రధానంగా లాభపడ్డాయి. అయితే, హెచ్యూఎల్, సన్ ఫార్మా, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి. యుఎస్ ఫెడ్ వడ్డీ రేటు కోత తర్వాత అంతర్జాతీయ పెట్టుబడిదారుల రిస్క్ సామర్థ్యం పెరగడం దేశీయ ఈక్విటీలకు బలాన్ని ఇచ్చింది.
రూపాయి విలువ శుక్రవారం 19 పైసలు పడిపోయి 90.41 స్థాయికి చేరుకుంది. ఎఫ్ఐఐల నిధుల తరలింపు కూడా కొనసాగినప్పటికీ మార్కెట్ పుంజుకుంది. బీఎస్ఈ మిడ్క్యాప్ గేజ్ 1.14 శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.65 శాతం పెరిగాయి. మెటల్ సెక్టార్ అత్యధికంగా 2.58 శాతం లాభపడింది. మొత్తం 2,593 స్టాక్స్ లాభపడగా, 1,593 స్టాక్స్ పడిపోయాయి. గురువారం ఎఫ్ఐఐలు రూ.2,020.94 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మగా, డీఐఐలు రూ.3,796.07 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.

