
న్యూఢిల్లీ: ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్)లో కిరాక్ హైదరాబాద్ జట్టుకు రెండో ఓటమి ఎదురైంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 7–-16తో రోహ్తక్ రౌడీస్ జట్టు చేతిలో ఓడింది. తొలుత 80 కేజీల్లో మజీద్ 0–1తో మనోజ్ చేతిలో ఓడినా.. సిద్దార్థ్ (90 కేజీ) 1–-0తో నగార్పై పైచేయి సాధించాడు. విమెన్స్ 55 కేజీల్లో సవిత 1–-0తో శివానిపై నెగ్గడంతో అండర్ కార్డ్ మ్యాచుల్లో హైదరాబాద్ 2–-1తో ఆధిపత్యం చూపించింది. మెయిన్ కార్డ్ మెన్స్100 కేజీల పోరులో జగదీశ్ 0-–5తో ధారా సింగ్ చేతిలో ఓడగా.. అరాఫత్ (60 కేజీ) 5-–0తో నిఖిల్ను ఓడించాడు. కానీ, చివరిదైన 65 ప్లస్ కేజీల ఫైట్లో జిన్సీ జోశ్ 0–10 తేడాతో నిర్మలా దేవి చేతిలో చిత్తవడంతో హైదరాబాద్కు ఓటమి తప్పలేదు.