
సెక్రటేరియెట్ షిఫ్టింగ్ మొదలై పదిహేను రోజులుదాటుతున్నా ఇప్పటికీ సగం కూడా పూర్తి కాలేదు. ఈ నెలాఖరుకల్లా షిఫ్టింగ్ పూర్తి చేయాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మరో వారం రోజుల సమయమే ఉండటంతో ఆలోగా షిఫ్టింగ్ పూర్తవుతుందా అంటే అనుమానమేనని ఉద్యోగులు అంటున్నారు. ప్రభుత్వ శాఖలలో అతిపెద్ద శాఖ అయిన రెవెన్యూతోపాటు హౌసింగ్, మరి కొన్ని శాఖల తరలింపు ఇప్పటికీ మొదలుకాలేదు.
మెట్రోరైల్ భవన్కు సీఎంవో!
బేగంపేట మెట్రో రైల్ భవన్ కు సీఎం ఆఫీసు షిఫ్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అక్కడ రెండు ఫ్లోర్లు ఇచ్చేందుకు మొదట అధికారులు ప్రతిపాదించారు. ఇప్పుడు భవనం మొత్తాన్ని సీఎంవోకు ఉపయోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ భవన్లో ఉన్న మెట్రోరైల్ కార్యాలయాన్ని సైఫాబాద్ లోని పాత మెట్రో రైల్ భవన్ లోకి షిఫ్ట్ చేయాలని ఉన్నతాధికారులు సూచించినట్లు తెలుస్తోంది.
షిఫ్టింగ్కు ముందుకు రాని ఏజెన్సీలు
సెక్రటేరియెట్ షిఫ్టింగ్ను శాఖల వారీగా విభజించి మొత్తం ఏడు ఏజెన్సీలకు షిఫ్టింగ్ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. అయితే తరలింపు మొదలైన నాటి నుంచి మూడు ఏజెన్సీలు మాత్రమే ఆ పనుల్లో పాల్గొంటున్నాయి. షిఫ్టింగ్ పూర్తయిన తర్వాతే బిల్లులు మంజూరు చేస్తాననని ప్రభుత్వం చెప్పటం, ఇప్పటికే తాము చేసిన వివిధ పనులకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉండటంతో.. మిగతా నాలుగు సంస్థలు సెక్రటేరియెట్ షిఫ్టింగ్లో పాల్గొనడం లేదని సెక్రటేరియెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. సెక్రటేరియెట్లోని 80శాతం శాఖలను బీఆర్కే భవన్కు తరలిస్తుండటంతో వచ్చే నెల 1 నుంచి భవన్లో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అధికారులు అంటున్నారు. భవన్లో మరమ్మతులు వేగంగా కొనసాగుతున్నాయి.