
' కింగ్ డమ్ ' ( Kingdhum ) మూవీ గ్రాండ్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు నటుడు విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ). బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ రావడంతో అభిమానులు థీయేటర్లకు క్యూ కడుతున్నారు. మూవీ సక్సెస్ తర్వాత విజయ్ దేవరకొండ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ ప్రేక్షకులు మంచి ఓపెనింగ్స్ ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. వర్కింగ్ ఫ్రైడే కూడా కలెక్షన్లు బాగున్నాయని తెలిపారు. ఈ సినిమాను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడంలో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి వందశాతం నిజాయితీ ఉందని కొనియాడారు.
తెలుగు, తమిళంలో కింగ్ డమ్ మూవీకి విశేషమైన ప్రేక్షకాదరణ దక్కుతోందని విజయ్ చెప్పారు. ఈ సినిమా విషయంలో ఒత్తిడికి గురైన మాట వాస్తమేనని తెలిపారు. ఈ సినిమా హిట్ అయిందని ప్రశాంతంగా కూర్చోలేం కదా.. తర్వాత చిత్రం కోసం రిలాక్స్ అయిపోలేం కదా అని అన్నారు. 'కింగ్ డమ్ 'మూవీకి మొదట 'నాగ దేవర' టైటిల్ అనుకున్నాం.. కానీ ఎన్టీఆర్ సినిమా 'దేవర' కోసం ఆ టైటిల్ వదులుకున్నామని తెలిపారు. 'కింగ్ డమ్ పార్ట్ 2' ( Kingdhum Part 2 ) కూడా ఉంటుందని ఈ సందర్భంగా వెల్లడించారు.
'కింగ్ డమ్ ' మొదటి పార్ట్ లో సూరి జర్నీ మాత్రమే చూపించామని , అన్నను వెతుక్కుంటూ ఎలా వెళ్లాడన్నది మాత్రమే తీశామని విజయ్ దేవరకొండ వివరించారు. ఒక కానిస్టేబుల్ కథతో మొదలై రాజు అవడంతో ఈ పార్ట్ 1 ముగిసింది. 'కింగ్ డమ్ పార్ట్ 2 ' మరింత ఆసక్తికరంగా ఉండనుందని చెప్పారు. పార్ట్ 2లో కచ్చితంగా స్టార్ హీరో ఉంటారని తెలిపారు. అది ఎవరనేది మాత్రం దర్శకుడు గౌతమ్ చెబుతారని సస్పెన్స్ లో పెట్టేశారు విజయ్. నెగిటివిటీ గురించి పెద్దగా పట్టించుకోనని స్పష్టం చేశారు.
అర్జున్ రెడ్డికి బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నప్పుడు గర్వంగా అనిపించిందన్నారు విజయ్. ఇంత మంది తనను చూడడానికి వస్తున్నారంటే అది నా అదృష్టం. అభిమానులు, ప్రేక్షకులు పంచే ప్రేమ అని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాహుల్ సాంకృత్వాన్ దర్శకత్వంలో ఓ మూవీలో చేస్తున్నట్లు తెలిపారు. ఇది రాయలసీమ నేపథ్యంలో సాగే కథ. మరొకటి రవి కిరణ్ కోలాతో కలిసి చేస్తున్నట్లు చెప్పారు.
'కింగ్ డమ్' బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కురిపిస్తోంది. ఫస్ట్ డే (జూలై 31న) థియేటర్లలో విడుదలైన కింగ్డమ్ ప్రపంచవ్యాప్తంగా రూ.39 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక రెండో రోజూ కాస్త మగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. సెకండ్ డే సుమారు. రూ. 14 కోట్లు రాబట్టినట్లు సమాచారం . ఈ రెండు రోజుల్లోనే దాదాపు రూ. 53 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. శని, ఆదివారాలు సెలవు రోజు కావడంతో కలెక్షన్స్ పెరిగి బెంచ్ మార్క్ లను దాటే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.