
- భరోసా ఇచ్చిన అమిత్ షా
- వీడియో కాన్ఫరెన్స్లో ఐఎంఏ ప్రతినిధులతో మాట్లాడిన షా
న్యూఢిల్లీ: కరోనా పోరులో ముందున్న వైద్య సిబ్బందిపై ఎలాంటి దాడులు జరగకుండా సెక్యూరిటీ కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రతినిధులతో షా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్థన్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా వైద్యులు చేస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. దేశవ్యాప్తంగా చాలా చోట్ల వైద్యులపై దాడులు జరిగిన ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో డాక్టర్లు దేశ్యాప్తంగా సింబాలిక్ ప్రొటెస్ట్కు పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం అందరూ తెల్లకోట్లు వేసుకుని క్యాండిల్స్ పట్టుకుని నిరసన తెలియజేసేందుకు సిద్ధమయ్యారు. ‘వైట్ అలర్ట్ ’ పేరుతో నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎలాంటి నిరసనలకు దిగొద్దని అమిత్ షా వారిని రిక్వెస్ట్ చేశారు. ప్రభుత్వం కచ్చితంగా డాక్టర్లకు అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. “ మన వైద్యులకు వారి వర్క్ ప్లేస్లో అన్ని వేళలా అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం మన సామూహిక బాధ్యత. వాళ్ల భద్రతకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రొటెస్ట్ను నిలిపేయాలని కోరాను” అని అమిత్ షా ట్వీట్ చేశారు. కరోనా టెస్టులు చేసేందుకు వెళ్లిన, హాస్పిటల్స్లోని చాలా మంది డాక్టర్లపై రోగులు దాడులు చేసిన ఘటనలు జరిగాయి.