- పోలీసులను నెట్టేసి పారిపోయిన నిందితులు
- సికింద్రాబాద్ లోని గోకుల్ లాడ్జిలో ఘటన
సికింద్రాబాద్,వెలుగు: లాడ్జిలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో గంజాయిని స్వాధీనం చేసుకోగా.. నిందితులు తప్పించుకుని పారిపోయిన ఘటన గోపాలపురం పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం..లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు బుధవారం రాత్రి సికింద్రాబాద్ లోని గోకుల్ లాడ్జిలో ఎస్ఐ వేణుగోపాల్ సిబ్బందితో తనిఖీలు చేస్తున్నారు. రూమ్ నం. 507 వద్దకు వెళ్లి తలుపులు కొట్టగా ఇద్దరు వ్యక్తులు తలుపులు తీశారు. గదిలోకి వెళ్లి 4 బ్యాగులను తనిఖీలు చేశారు. అందులో 50 కేజీల గంజాయి ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన నిందితులను పోలీసులను నెట్టేసి పారిపోయారు.
పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. లాడ్జిలో రిజిస్టర్ లో నిందితులు అమన్ కుమార్(26), అర్జున్ కుమార్(25)గా పేర్లు నమోదు చేశారు. గుర్తింపు కార్డును యజమానికి పంపిస్తామని అక్కడున్న బాయ్ కు తెలపగా.. అతడు కూడా గుర్తింపుకార్డును తీసుకోలేదని తెలిసింది.