
వెంకటాపురం, వెలుగు: గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని ములుగు జిల్లా వాజేడు పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద 15.60 కేజీలు స్వాధీనం చేసుకోగా.. దాని విలువ రూ 3. 92 లక్షలు ఉంటుంది. ఏటూరు నాగారం ఏఎస్పీ శివ ఉపాధ్యాయ తెలిపిన ప్రకారం.. బుధవారం రాత్రి వాజేడు మండలం మీదుగా భారీగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు నిఘా పెట్టి తనిఖీలు చేశారు. బైక్ పై ఇద్దరు వ్యక్తులు బ్యాగ్ తీసుకొని జగన్నాథపురం వై జంక్షన్ వైపు వెళ్తుండగా పోలీసులు అనుమానించి ఆపి.. చెక్ చేయగా గంజాయి లభించింది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన పొన్నాడ దుర్గ శివ, కుంజా నగేశ్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి గంజాయి తరలించడం, అమ్మడం చేస్తుంటే సమాచారం ఇవ్వాలని ఏఎస్పీ సూచించారు. వెంకటాపురం సీఐ బండారి కుమార్, వాజేడు ఎస్ఐ ఇమ్మాన్యుయేల్ ఉన్నారు.