
వరంగల్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్గాంధీ గుజరాత్ లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన కార్యక్రమం తరహాలోనే దేశమంతా డీసీసీల ఎంపిక ఉంటుందని వరంగల్, హనుమకొండ జిల్లాల ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్ తెలిపారు. సోమవారం ఆయన హనుమకొండలోని కాంగ్రెస్ భవన్లో అభియాన్ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లాతో పాటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.
రాష్ట్రం నుంచి అబ్జర్వర్లుగా హాజరైన దుర్గం భాస్కర్, మసూద్, రేణుక, ఆదర్శ్ జైస్వాల్తో పాటు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాయిని రాజేందరరెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు తదితరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డీసీసీల నియామకంలో భాగంగా అభిప్రాయాలు సేకరించారు.
అనంతరం జిల్లా అధ్యక్షుడు నాయిని మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీఆర్ఎస్ బాకీ కార్డును పంచుతోందని కాంగ్రెస్ కార్యకర్తలు దోఖా కార్డు పేరుతో బీఆర్ఎస్ 10 ఏండ్లలో చేసిన మోసాన్ని వివరించాలన్నారు. సమావేశంలో నేతలు బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఈవీ శ్రీనివాస్, అజీజ్ఖాన్, బంక సరళ, కార్పొరేటర్లు తోట వెంకన్న, జక్కుల రవీందర్, పోతుల శ్రీమాన్, విజయశ్రీ పాల్గొన్నారు.