పనాజీ: బీచ్లో సరదాగా గడిపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ సముద్రంలో గల్లంతయ్యారనే వార్తలు చదువుతూనే ఉంటాం.. ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు వెంటనే స్పందించేందుకు సరికొత్త రోబోలు వచ్చేశాయి. గోవా తీరంలో ఓ రోబో ఆల్రెడీ డ్యూటీ ఎక్కింది. ప్రమాదవశాత్తూ ఎవరైనా నీటిలో మునిగిపోతుంటే తనకు తానుగా స్పందించి, వారిని కాపాడేందుకు సముద్రంలోకి డైవింగ్ చేస్తుంది. ఈ రోబోకు అధికారులు ‘ఆరస్’ అని పేరుపెట్టారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతతో ప్రత్యేకంగా తయారుచేసిన రోబో ఇది. గోవా బీచ్కు వచ్చే టూరిస్టుల భద్రత కోసం అక్కడి ప్రభుత్వం ఏఐ మానిటరింగ్ సిస్టమ్ ట్రిటాన్ తో పాటు ‘ఆరస్’ హెల్ప్ తీసుకుంటున్నది.
మానిటరింగ్ కోసం ట్రిటాన్ సిస్టమ్
గోవా బీచ్కు ప్రతీ ఏడాది డొమెస్టిక్తో పాటు ఫారిన్ టూరిస్టుల తాకిడి పెరుగుతున్నది. ఎంజాయ్ చేద్దామని నీళ్లలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నదని దృష్టి మెరైన్ తెలిపింది. గోవా కోస్టల్ బెల్ట్ ఏరియాలో రెండేండ్లలో వెయ్యి కంటే ఎక్కువ మందిని రెస్క్యూ చేశామని లైఫ్గార్డ్ ఏజెన్సీ చెప్పింది. ‘ఆరస్’ సెల్ఫ్ డ్రైవింగ్ రోబో అని, నాన్ స్విమ్మింగ్ జోన్స్లో పెట్రోలింగ్ చేస్తుంటుందని తెలిపింది. అలల తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు టూరిస్టులను అలర్ట్ చేస్తుందని వివరించింది. లైఫ్ సేవర్గా సేవలు అందిస్తుందని, బీచ్లో సర్వైలైన్స్తో పాటు క్రౌడ్ మేనేజ్మెంట్ పెంచడానికి ఉపయోగపడుతుందని పేర్కొంది. ఇప్పటికైతే నార్త్ గోవాలోని మిరామర్ బీచ్లో ‘ఆరస్’ సేవలు అందుతున్నాయి. ట్రిటాన్ మానిటరింగ్ సిస్టమ్ను సౌత్ గోవాలోని బైనా, వెల్సానో, బెనౌలిమ్, గల్గిబాగ్, నార్త్ గోవాలోని మోర్జిమ్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.