- రేపటి నుంచి జులై 5 వరకు ప్రధాన మార్కెట్లన్నీ క్లోజ్
- ఇప్పటికే మూతపడ్డ జనరల్ బజార్, లాడ్ బజార్
- పలు జిల్లాల్లోనూ షట్డౌన్.. కరోనా కట్టడిపై సీఎం సమీక్షలు బంద్
- గ్రేటర్లో 50వేల టెస్టులని చెప్పి.. 20వేలే చేశారు!
రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో మార్కెట్లు, షాపులు సెల్ఫ్ లాక్డౌన్లోకి వెళ్తున్నాయి. ఎక్కడి నుంచి, ఎవరి నుంచి, ఎలా వైరస్ అంటుకుంటుందోనని వ్యాపారులు భయపడుతున్నారు. ఇదే టైంలో ప్రభుత్వం టెస్టులు చేయడం కూడా ఆపేయడం మరింత ఆందోళనకు దారితీసింది. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్లోని ప్రధాన మార్కెట్లన్నీ మూతపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని మార్కెట్లు మూతపడగా.. దాదాపు మిగతా మార్కెట్లన్నీ ఆదివారం నుంచి జులై 5 వరకు బంద్ కానున్నాయి.
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని ప్రధాన మార్కెట్లు స్వచ్ఛంద బంద్ పాటిస్తున్నాయి. కరోనా వ్యాప్తి తీవ్రమవుతుండటంతో వ్యాపారులు సెల్ఫ్ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. సికింద్రాబాద్ జనరల్ బజార్, సూర్యా టవర్స్, ప్యారడైజ్ ప్రాంతాల్లో ఇప్పటికే అన్ని షాపులు క్లోజ్ అయ్యాయి. జులై 5 వరకు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నట్లు గోల్డ్ అండ్ సిల్వర్ మర్చంట్ అసోసియేషన్, హైదరాబాద్ కిరాణ మార్చంట్అసోసియేషన్లు ప్రకటించాయి. శుక్రవారం నుంచి చార్మినార్లోని లాడ్ బజార్ బందైంది. తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద ఎలక్ట్రికల్ మార్కెట్ ట్రూప్ బజార్ కూడా శనివారం నుంచి వచ్చే నెల 5 వరకు మూతపడనుంది.
మూడ్రోజులు హోల్సెల్ మెడికల్ షాపులు బంద్
హోల్ సేల్ మెడిసిన్స్ అమ్మకాలకు పేరొందిన హైదరాబాద్లోని ఇంద్రబాగ్ వ్యాపారులు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు తమ వ్యాపారాలను మూసి వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28 వరకు ఎలాంటి అమ్మకాలు ఉండవని, ఎవరూ కొనుగోళ్లకు రావొద్దని ఇంద్రబాగ్ మెడికల్ ట్రేడర్స్ అసోసియేషన్ సూచించింది.
రేపటి నుంచి బేగంబజార్, రాణిగంజ్ లాక్
హైదరాబాద్లోని బేగంబజార్, రాణిగంజ్ మార్కెట్లు ఆదివా రం నుంచి మూతపడనున్నాయి. బేగంబజార్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇక్కడ సుమారు 700 హోల్సేల్ షాపులు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో చిన్నాచితక వ్యాపారులు వస్తుంటారు. దీంతో వైరస్ వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున ఈ నెల 28 నుంచి జులై 5 వరకు పూర్తిగా మూసివేయనున్నారు. బేగంజజార్ మార్కెట్ పరిధిలోకి వచ్చే కిషన్గంజ్, మహారాజ్గంజ్, బర్తన్ బజార్ తదితర మార్కెట్లు కూడా బంద్ కానున్నాయి. సికింద్రాబాద్లోని రాణిగంజ్ మార్కెట్లో కూడా వ్యాపారులు సెల్ఫ్ లాక్డౌన్ పాటించనున్నారు.
ఆదివారం నుంచి 8 రోజుల పాటు రాణిగంజ్ హబ్లోని 5 వేల షాపులు బంద్ కానున్నాయి. నాంపల్లిలోని ఫర్నిచర్స్ షాప్స్ అన్నీ స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. శుక్రవారం నుంచి జులై 5 వరకు సెల్ఫ్ లాక్ డౌన్ పాటిస్తున్నట్లు తెలంగాణ ఫర్నిచర్స్ మ్యానిఫెక్చర్స్ అండ్ డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఉస్మాన్గంజ్ మార్కెట్ఇక రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది.
జగదీశ్ మార్కెట్ క్లోజ్?
సెల్ఫోన్లకు కేరాఫ్గా ఉన్న హైదరాబాద్లోని జగదీశ్ మార్కెట్ కూడా బందయ్యే అవకాశాలున్నాయి. శనివారం జగదీశ్ మార్కెట్ అసోసియేషన్ బోర్డు నిర్ణయం తీసుకోనుంది. సోమవారం నుంచి వారంపాటు జగదీశ్ మార్కెట్లో సెల్ఫ్ లాక్ డౌన్ పాటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
జిల్లాల్లోనూ బంద్
- జిల్లాల్లోనూ కేసులు పెరుగుతుండటంతో అక్కడి వ్యాపారులు సెల్ఫ్ లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఊళ్లలో, పట్టణాల్లో షాపులను, వ్యాపారాలను బంద్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో కొంత టైం వరకు మాత్రమే షాపులను తెరుస్తున్నారు.
- పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కిరాణ షాపులను ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే తెరుస్తున్నారు. మధ్యాహ్నం 2 తర్వాత తెరిచి ఉంచిన వారికి వర్తక సంఘం రూ. 5వేల ఫైన్ వేస్తోంది.
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని గర్షకుర్తి, వీణవంక మండలంలోని వల్బాపూర్ గ్రామాలు సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించుకున్నాయి. జనగామ టౌన్మొత్తం శుక్రవారం నుంచి స్వచ్ఛంద లాక్ డౌన్ పాటిస్తోంది. కిరాణ, వైన్స్, మెడికల్ షాపులు మాత్రమే ఓపెన్ ఉంటున్నాయి. ఈ నెల 30 వరకు ఇది అమల్లో ఉండనుంది.
- కామారెడ్డి జిల్లా సదాశివనగర్, పద్మాజివాడీ ఎక్స్రోడ్డులో రెండ్రోజుల నుంచి సెల్ఫ్ లాక్డౌన్ కొనసాగుతోంది. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని జూలూరులో ఒక పాజిటివ్ కేసు రావడంతో మూడ్రోజుల నుంచి అక్కడ షాపులు బంద్ చేశారు.
- సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని తంగళ్ళపల్లిలో ఒకరికి కరోనా రావడంతో వారం నుంచి ఊరోళ్లంతా సెల్ఫ్ లాక్ పాటిస్తున్నారు. కోహెడ తోపాటు సిద్దిపేట టౌన్లో షాపులను సాయంత్రం ఆరింటి వరకు మాత్రమే తెరిచి ఉంచుతున్నారు.
- సంగారెడ్డి జిల్లాలో మునిపల్లి, మేళా సంఘం, కంకోల్, దౌల్తాబాద్ గ్రామాలు సెల్ఫ్ లాక్డౌన్ విధించుకున్నాయి. షాపులను మధ్యాహ్నం 12 గంటల వరకే తెరిచి ఉంచుతున్నారు.
- నల్గొండ పట్టణంలో 6 గంటలకి షాపులు మూసేయాలని వస్త్ర వ్యాపారులు తీర్మానం చేసుకున్నారు. నకిరేకల్ లో రెండు కేసులు రావడంతో మెయిన్ రోడ్డు, మూసీ రోడ్డులో మూడ్రోజుల నుంచి అన్ని షాపులను సాయంత్రం ఐదు గంటలకే క్లోజ్ చేస్తున్నారు.
- జగిత్యాల, మంచిర్యాల జిల్లా కేంద్రాల్లో శుక్రవారం నుంచి సాయంత్రం 6 గంటలకే క్లోజ్చేస్తున్నారు. మందమర్రిలో మధ్యాహ్నం రెండింటి వరకే షాపులను తెరిచి ఉంచుతున్నారు.
- వరంగల్ బీట్ బజార్ లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 వరకే షాప్ లు తెరుస్తున్నారు. హన్మకొండ లోని సెలూన్ షాపు లు జులై 1 వరకు క్లోజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆసిఫాబాద్లో శనివారం జరగనున్న సంతను రద్దు చేశారు.
- కొత్తగూడెం పట్టణంలో సాయంత్రం 5 కే షాపులు క్లోజ్చేసేలా వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు.
- రాజన్నసిరిసిల్లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 4గంటల వరకే షాపులు తెరిచి ఉంటాయని పెద్ద బజార్ కిరాణ వర్తక సంఘం తెలిపింది.
- జనగామ జిల్లా కేంద్రంలోనూ ఈ నెల 30 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు తెరిచి ఉంచాలని చెప్పారు.
కేసులు పెరుగుతున్నయని…
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నయి. బేగంబజార్లో పనిచేస్తున్న వారికి కూడా పదుల సంఖ్యలో కరోనా అంటింది. దీంతోముందస్తు జాగ్రత్తగా సెల్ఫ్ లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నం.
– లక్ష్మీ నారాయణ్ రాఠీ, బేగంబజార్ కిరాణ మర్చంట్ ప్రెసిడెంట్, హైదరాబాద్
అందరూ బాగుండాలని…
లాక్ డౌన్ తర్వాత మార్కెట్కు వస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ఎవరిలో వైరస్ ఉందో అర్థం కానీ పరిస్థితి. మాతో పాటు మార్కెట్లో పనిచేసే ప్రతి ఒక్కరూ బాగుండాలని బంద్ పాటిస్తున్నం.
– వి.ఎస్ జనార్దనమూర్తి, రాణిగంజ్ మర్చంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సికింద్రాబాద్