సోషల్ ​మీడియాలో..ఫేక్​ ఐపీఎల్ టికెట్ల విక్రయం

సోషల్ ​మీడియాలో..ఫేక్​ ఐపీఎల్ టికెట్ల విక్రయం
  •     క్రికెట్ అభిమానులను టార్గెట్​ చేసిన సైబర్ నేరగాళ్లు
  •     తమ వద్ద టికెట్లు ఉన్నాయంటూ పోస్టులు 
  •     అమాయకుల నుంచి అందినకాడికి దోపిడీ 

హైదరాబాద్, వెలుగు : సైబర్ నేరగాళ్లు క్రికెట్​అభిమానులను టార్గెట్​చేస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ఐపీఎల్ క్రేజ్​ను క్యాష్​చేసునేందుకు సరికొత్త మోసానికి తెరలేపారు. అఫీషియల్ సైట్ లో కంటే తక్కువ రేటుకు టికెట్లు ఇస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నిజమేనని నమ్మిన వారి నుంచి అందినకాడికి దోచేస్తున్నారు. ఏప్రిల్​5న హైదరాబాద్​ఉప్పల్​స్టేడియం వేదికగా సన్​రైజర్స్ హైదరాబాద్ వర్సెస్​చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్​జరగనుంది. 

గతేడాది సిటీలో సీఎస్కే మ్యాచ్​జరగలేదు. రెండేళ్ల తర్వాత సిటీలో సీఎస్కే మ్యాచ్ జరుగుతుండడంతో భారీ క్రేజ్ ఏర్పడింది. ఎలాగైనా ఈసారి స్టేడియంకు వెళ్లాలని, తమ అభిమాన క్రికెటర్​ధోనీ ఆటను లైవ్​లో చూడాలని ఫ్యాన్స్​ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే పేటీఎంలో పెట్టిన చెన్నై, హైదరాబాద్ మ్యాచ్​టికెట్లు హాట్​కేకుల్లా అమ్ముడుపోయాయి. పేటీఎం యాప్, సైట్​లో ఈ మ్యాచ్​కు సంబంధించి సెర్చ్​చేస్తే సోల్డ్​అవుట్​అని వస్తోంది. 

ఈ విషయాన్ని పసిగట్టిన సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఫేస్​బుక్, ట్విట్టర్, ఇన్​స్టాగ్రామ్ లో ఐపీఎల్​టికెట్స్​సెల్లర్​పేర్లతో ప్రత్యేక అకౌంట్లు క్రియేట్​చేస్తున్నారు. మ్యాచ్​టికెట్లు అందుబాటులో ఉన్నాయని పోస్టు చేస్తున్నారు. స్పందించిన వారికి క్యూఆర్ కోడ్​పంపించి అడ్వాన్స్​గా రూ.1000 చెల్లించాలని సూచిస్తున్నారు. తర్వాత 30 నిమిషాలకు ఈ–మెయిల్‌కు ఈ–టికెట్స్ పంపిస్తామని ట్రాప్‌ చేస్తున్నారు. ఈ– టికెట్స్ వచ్చిన తర్వాత డబ్బు మొత్తం చెల్లించాలని మోసగిస్తున్నారు. ఫిజికల్​ టికెట్స్ కావాలంటే 48 గంటల తరువాత స్టేడియం బయట తీసుకోవచ్చని నమ్మబలుకుతున్నారు. వలలో పడిన అమాయకుల నుంచి అందినకాడికి దోచేస్తున్నారు. 

చెన్నై మ్యాచ్​ టికెట్లు లేవ్

ఏప్రిల్​5న ఉప్పల్ స్టేడియంలో జరిగే​చెన్నై, హైదరాబాద్​మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు ఇప్పటికే పూర్తిగా అమ్ముడుపోయాయని సైబర్​క్రైమ్​పోలీసులు తెలిపారు. పేటీఎం కూడా సోల్డ్​అవుట్​పెట్టేసిందని, సైబర్ నేరగాళ్ల పోస్టులను నమ్మొద్దని సూచిస్తున్నారు. టికెట్ల కోసం సైబర్​నేరగాళ్లు పంపిస్తున్న క్యూ ఆర్‌‌ కోడ్ చేయొద్దని, లింక్స్‌ ఓపెన్ చేయొద్దని చెబుతున్నారు. ఈ మేరకు రాచకొండ సైబర్ క్రైమ్‌ పోలీసులు సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో ప్రచారం చేస్తున్నారు. అనుమానాస్పద లింకులు, క్యూఆర్​కోడ్ల ద్వారా చెల్లింపులు చేయెద్దని అప్రమత్తం చేస్తున్నారు. బాధితులు 1930 నంబర్ లేదా స్థానిక సైబర్‌‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.